సాక్షి, అమలాపురం: కోనసీమ రైతుల సాగుసమ్మె ప్రకటన విషయంలో ఏ ప్రభుత్వం ఎలా స్పందించిందనే దానికి ఈ రెండు ఉదాహరణలు చాలు. అలాగే.. రైతు సమస్యల పరిష్కార విషయంలో ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందనే దానికీ ఈ రెండు ఘటనలు అద్దం పడతాయి.
అధికారంలో ఉండగా తాము రైతులపట్ల ఎంత అమర్యాదగా ప్రవర్తించాం, ఎంత అణచివేత ధోరణితో వ్యవహరించామో అనే విషయాన్ని మరిచి చినరాజప్ప, ఆనందరావులు తమ హయాంలో కోనసీమలో సాగుసమ్మె జరిగే పరిస్థితి రాలేదని, తమ పాలనలో రైతుల సమస్యలు పరిష్కరించామని నిస్సిగ్గుగా చెప్పడంతో చూసి రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు.
ధాన్యం సొమ్ములు విడుదల చేసినప్పటికీ రైతులకు ధాన్యం సొమ్ముల బకాయిలు ఉన్నందునే రైతులు సాగుసమ్మె చేస్తున్నారని చెప్పడం చూసి సొంత పార్టీ నేతలే నిర్ఘాంతపోయారు.
అప్పట్లో ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు..
ఆ ఐదేళ్లూ రైతులు ఖరీఫ్కు దూరం
మరోవైపు.. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కోనసీమలోని కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి, రాజోలు మండలాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో రైతులు ఖరీఫ్ సాగుచేయడం మానేశారు. ఇప్పుడు సాగుసమ్మె రైతులకు మద్దతుగా మాట్లాడుతున్న రాజప్ప, ఆనందరావుల సొంత మండలం ఉప్పలగుప్తంలోని పలు గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా పంట విరామం పాటించారు. అయితే, వీరిద్దరూ తమ హయాంలో సాగుసమ్మె చేయాల్సిన అవసరంలేకుండా చేశామని గొప్పలకు పోతున్నారని రైతులు విమర్శిస్తున్నారు.
నాడు..
అది 2018.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయం.. కోనసీమలో రైతులు సాగుసమ్మె ఉద్యమానికి సిద్ధమయ్యారు. అమలాపురం మండలం ఈదరపల్లి జనహిత భవనంలో రైతులు సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. ఇంతలో పోలీసులు వచ్చారు. సెక్షన్–30 ఉందని, సమావేశాలకు అనుమతిలేదన్నారు. రైతులు మాట్లాడుతున్న మైకు తీసుకుని నేలకేసి కొట్టారు. కుర్చీలు తన్నేశారు.
ఆ తర్వాత రైతులను ఆర్డీఓ కార్యాలయంలో చర్చలకు రమ్మని పిలిచారు. అప్పటి హోంమంత్రి చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులు ‘సమస్యలు పరిష్కరిస్తాం.. సాగుచేయండి. అంతేకాని సాగుసమ్మె అన్నారా? చూస్తూ ఊరుకునేదిలేదు’ అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. పోలీసు కేసులంటూ హెచ్చరించారు.
ఇక కోనసీమ రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రస్తుత ఏపీ స్టేట్ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్రెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామిల మీద పోలీసులు కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ, రైతు సమస్యల పరిష్కారానికి మాత్రం బాబు సర్కారు చొరవ చూపలేదు.
సీన్ కట్చేస్తే నేడు..
కోనసీమలో సాగుసమ్మె చేస్తామని టీడీపీ అనుకూల రైతు సంఘాల నాయకులు ఇటీవల ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. అమలాపురంలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో కోనసీమలో సెక్షన్–30, 144 సెక్షన్ అమలులో ఉంది. దీనిని బూచిగా చూపి ప్రభుత్వం బెదిరింపులకు దిగలేదు. రైతులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ఆగమేఘాల మీద కదిలింది. ధాన్యం సొమ్ములు అందలేదన్న రైతుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని 48 గంటల్లో చెల్లిస్తామని చెప్పింది.
12 గంటలు దాటకుండానే వారి ఖాతాల్లో జమచేసింది. 21 రోజులు దాటిన తరువాత ఇవ్వాల్సిన సొమ్ములు కూడా ముందుగానే చెల్లించింది. మురుగు, పంట కాలువల్లో పూడిక తొలగింపునకు తాత్కాలిక పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తోంది. రైతుకు విత్తనం నుంచి ధాన్యం కొనేవరకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని, సాగుచేయాలని రైతులకు ధైర్యాన్నిస్తోంది.
అప్పట్లో కేసులు పెడతామన్నారు
టీడీపీ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు మాకు ముంపే సమస్య. కూనవరం మొగ పూడుకుపోవడంవల్ల చేలు ముంపులో ఉండేవి. అప్పుడు సాగుసమ్మె అంటే కేసులు పెడతామన్నారు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్లొచ్చి సాగుసమ్మె చేయమంటే ఎలా చేస్తాం? ఇప్పుడు మా సమస్యలు చెబితే ప్రభుత్వం స్పందించింది. అప్పుడు కనీసం పిలిచి అడిగినవాడు లేడు. మేమైతే సాగు చేస్తాం.
– మామిడిపల్లి కృష్ణ, చెయ్యేరు, కాట్రేనికోన మండలం, కోనసీమ జిల్లా
ఇప్పుడు అడిగినవన్నీ ఇచ్చారు
ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసా వేసింది.. ధాన్యం డబ్బులిచ్చారు. ప్రభుత్వం మేం అడిగినవన్నీ ఇచ్చింది. మావోళ్లు అడిగారనే ముందుగా నీరిచ్చారు. ముంపు సమస్య తీరుస్తామంటున్నారు. సాగుచేయకుండా ఎలా ఉంటాం? సొంతంగా రెండెరాలుంది. మరో నాలుగు కౌలుకు చేస్తున్నాం. మా ఊళ్లో ఆలస్యంగా ఊడ్పులు చేస్తాం. ఈసారి కొద్దిరోజులు ముందుగానే ఊడ్చాలనుకుంటున్నాం.
– సలాది రాముడు, రైతు, నంగవరం, ఉప్పలగుప్తం మండలం, కోనసీమ జిల్లా
ఈ మూడేళ్లలో ఇలా..
టీడీపీ పాలనలో అన్నదాతల వేదన అరణ్యరోదనగా మారితే ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్ల పాలనలో రైతులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. కలలో కూడా ఊహించని మార్పులు గ్రామసీమల్లో సాకారమవుతున్నాయి.