ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు

24 Mar, 2021 05:02 IST|Sakshi
మీడియా సమావేశంలో మంత్రి గౌతమ్‌రెడ్డి, జర్మనీ కాన్సులేట్‌ జనరల్‌ కరిన్‌ స్టోల్‌

జర్మనీ కాన్సులేట్‌ జనరల్‌ కరిన్‌ స్టోల్‌తో మంత్రి మేకపాటి సమావేశం

జర్మనీ మొగ్గు చూపే రంగాలకు రాష్ట్రం ప్రాధాన్యం కల్పించింది

గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా, ఆదాయంలో ఎలాంటి మార్పు ఉండదు

సాక్షి, అమరావతి: జర్మనీకి చెందిన పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ ప్రాధాన్యం ఇచ్చే తయారీ, ఉత్పత్తి, నైపుణ్యం, వైద్యం, సేంద్రియ వ్యవసాయం, సౌరవిద్యుత్‌ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుందన్నారు. మంగళవారం ఏపీటీఎస్‌ కార్యాలయంలో జర్మనీ కాన్సులేట్‌ జనరల్‌ కరిన్‌ స్టోల్‌తో మంత్రి మేకపాటి సమావేశమై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం గురించి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై జర్మనీ కాన్సులేట్‌ జనరల్‌ అడిగి తెలుసుకున్నారని చెప్పారు.

త్వరలో నెల్లూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి
కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్‌ ఈనెల 25న ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. 28 నుంచి విమానాల రాకపోకలు ప్రారం భమవుతాయన్నారు. నెల్లూరు ఎయిర్‌పోర్టును త్వర లో అభివృద్ధి చేస్తామన్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలో,  ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లో ఎటువంటి  మార్పు ఉండదని స్పష్టం చేశారు.  విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెటు ్టబడుల ఉపసంహరణపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని తెలిపారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్పష్టంగా సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. అంతకుముందు పరిశ్రమలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్‌ జర్మనీ కాన్సులేట్‌ జనరల్‌ కరిన్‌కు ఆహ్వానం పలికారు. పారిశ్రామికాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఏపీఐఐసీ ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. స్టార్టప్‌లలో పాలుపంచుకోవాలని ఏపీటీఎస్‌ ఎండీ నందకిశోర్‌ కోరారు. సమావేశంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పరిశ్రమలశాఖ అదనపు డైరెక్టర్‌ నాయక్, ఈడీబీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ కృష్ణ జీవీగిరి, ఐటీ సలహాదారు విద్యాసాగర్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

పెట్టుబడుల బాటలో ఏపీ
పెట్టుబడులకు అవకాశాలున్న మార్గంలో ఏపీ ముందుకెళుతోందని జర్మనీ కాన్సులేట్‌ జనరల్‌ కరిన్‌స్టోల్‌ పేర్కొన్నారు. నైపుణ్యరంగంపై దృష్టి పెట్టడం మంచి పరిణామమన్నారు.  

మరిన్ని వార్తలు