15 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే నవ దంపతుల సూసైడ్‌.. ఏం జరిగింది?

15 Sep, 2022 08:29 IST|Sakshi

పిడుగురాళ్ల: పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుని 15 రోజులైనా గడవక ముందే ఆత్మహత్యకు యత్నించింది ఓ నవ జంట. భార్య మరణించగా.. భర్త ప్రాణాలతో పోరాడుతున్నారు.  ఈ హృదయ విదారక ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల  రజక కాలనీలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. 

స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కాలనీకి చెందిన చంపాల నాగేశ్వరరావు మరణించడంతో ఆయన భార్య నాగమ్మ కూలిపనులు చేసుకుంటూ కుమార్తె అఖిల(17)తో కలిసి ఉంటుంది. అఖిల ఇంటర్‌ పూర్తిచేసింది. అదే కానీలకి చెందిన తాడువాయి వెంకట శివ కొడుకు వినయ్‌ ఇంటర్‌ పూర్తి చేసి ప్రైవేటు కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వినయ్, అఖిల ఒకరినొకరు ఇష్టపడ్డారు. తల్లిదండ్రులను ఒప్పించి గతనెల 31న గుడిలో పెళ్లి చేసుకున్నారు. 

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నాగమ్మ నవ దంపతులను భోజనానికి పిలిచేందుకు వారి గది వద్దకు వెళ్లింది. ఎంతసేపు పిలిచినా తలుపు తీయకపోవడంతో తలుపు సందులో నుంచి చూసింది. గదిలో ఇనుప కడ్డీకి ఇద్దరూ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. దీంతో ఆమె కేకలు పెడుతూ బయటకు వచ్చింది. స్థానికులు  తలుపులు పగలగొట్టి ఇద్దరినీ కిందికి దింపారు. అఖిల అప్పటికే మరణించింది. కొన ఊపిరితో ఉన్న వినయ్‌ను ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

కట్నం విషయంలో గొడవే కారణమా? 
కట్నం విషయంలో ఇరు కుటుంబాల మధ్య సమస్య తలెత్తడంతో ఈనెల 12న పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడం వల్లే మనస్తాపం చెంది నవ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసి ఉంటారని భావిస్తున్నారు. గదిలో గోడపై ‘‘న్యాయం జరగాలి. పెద్ద మనుషులు న్యాయం చేయలేదు. ఇన్నిరోజులు ఆగి ఇప్పుడు చనిపోవడానికి కారణం న్యాయం జరుగుతుందని ఆశ’’ అని నల్లటి అక్షరాలతో రాసి ఉండడం దీనికి బలం చేకూరుస్తోంది.   
 

మరిన్ని వార్తలు