నీ ఒళ్లు బంగారంగాను..

22 Dec, 2020 11:58 IST|Sakshi

తిరుమల: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్నట్లు ఉంది ఈ ఫొటోలో అతని వ్యవహారశైలి. సాధారణంగా పురుషులు తమ మెడలో ఒకటో రెండో సన్నపాటి చైన్లు వేసుకోవడం అందరం చూస్తుంటాం. కానీ, ఇతగాడు ఏకంగా కేజిన్నర వరకు బరువు ఉండే దట్టమైన గొలుసులు వేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి ఇలా మీడియాకు చిక్కాడు. హైదరాబాద్‌కు చెందిన ఈ బంగారు బాబు తన వివరాలు చెప్పడానికి మాత్రం నిరాకరించాడు. అందరూ మాత్రం ఇతన్ని ఆసక్తిగా తిలకించారు.

శ్రీవారిని దర్శించుకున్న మైసూరు పరకాల పీఠాధిపతి
తిరుపతి ఎడ్యుకేషన్‌: మైసూరు పరకాల పీఠాధిపతి అభినవ వాగేశ స్వామి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అర్చకులు, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి బేడి ఆంజనేయస్వామి దర్శనం చేయించారు. అనంతరం శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించి, తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జైన్‌ శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌కు రూ.1.20 కోట్ల విలువైన డీఎస్‌ఎన్‌జీ వాహనాన్ని సోమవారం కానుకగా అందించారు. ప్రత్యేక పూజల అనంతరం వాహనం తాళాలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి ఆయన అందజేశారు.

బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద అభినవ వాగేశ స్వామి, జీయర్లు, అడిషనల్‌ ఈవో ధర్మారెడ్డి

మరిన్ని వార్తలు