వ్యాక్సినేషన్‌లో అందరికీ ఆదర్శంగా ఏపీ

8 May, 2021 04:43 IST|Sakshi

ఒక్క రోజులోనే 6.29 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశాం

నెలకు కోటి టీకాలు ఇవ్వాలని ప్రధానికి సీఎం లేఖ రాశారు

అవసరం మేరకు రాష్ట్రానికి వ్యాక్సిన్‌ రావడం లేదు

రాష్ట్రంలో మరో 35 లక్షల మందికిపైగా సెకండ్‌ డోస్‌ ఇవ్వాలి 

కేంద్రం నుంచి వచ్చే టీకాలు రెండో డోస్‌కే సరిపోతాయి

ప్రభుత్వం టీకాల కొనుగోలుకు రూ.45 కోట్లు చెల్లించింది

రూ.309 కోట్లతో 49 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి నెలకు ఒక కోటి కోవిడ్‌–19 టీకాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. వారంలో నాలుగు రోజుల్లో 25 లక్షలు టీకాలు వేసేలా నెలకు కోటి టీకాలు కావాలని లేఖలో కోరారన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఏపీ  ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా రాష్ట్రంలో ఒక్క రోజులోనే 6.29 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం సామర్థ్యాన్ని ప్రధానికి వివరించామన్నారు. అవసరం మేర కు రాష్ట్రానికి వ్యాక్సిన్‌ రావడం లేదని తెలి పారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్‌ ఆస్ప త్రుల్లో చికిత్స పొందే కరోనా బాధితులకు వైద్యం ఉచితమని, వీరి ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. వ్యాక్సినేషన్, కోవిడ్‌ చికిత్స, ఆక్సిజన్‌ సరఫరా, తదితర అంశాలపై  శుక్రవారం మంగళగిరిలో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాకు వివరించారు. 

సెకండ్‌ డోస్‌గా వేస్తాం..
ఇప్పటివరకు కేంద్రం నుంచి 73,49,960 వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయి. వాటిలో 53,58, 712 టీకాలు వేశాం. వీటిలో 17,96,691 మం దికి రెండు డోసులు ఇచ్చాం. మొత్తంగా 71, 55,403 డోసులు వేశాం. శుక్రవారం ఉదయానికి ఇంకా దాదాపు 2 లక్షలు మిగిలి ఉన్నాయి. 45 ఏళ్లకు పైబడి ఉన్నవారికి వేయడానికి కేంద్రం మే 1 నుంచి 15లోగా 9 లక్షల డోసు లు కేటాయించింది. వీటిలో 6,90,000 కోవి షీల్డ్‌ డోసులు పూర్తిగా వచ్చాయి. ఇంకా 1,08, 000 డోసులు ఈ నెల 15లోగా రావాల్సి ఉంది. ఈ డోసులతోపాటు రాష్ట్రంలో మిగిలి ఉన్న దాదాపు 2 లక్షలతో కలిపి ప్రస్తుతం 3 లక్షలకు పైబడి డోసులు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల రెండో పక్షానికి కూడా కేంద్రం వ్యాక్సిన్లు అందిస్తుంది. ఈ డోసులు మే 15 తర్వాత వస్తాయి. 35 లక్షల మందికిపైగా సెకండ్‌ డోస్‌ ఇవ్వాల్సి ఉండగా.. ఈ నెలా ఖరుకు 23,89,000 మందికి సెకండ్‌ డోస్‌ గడువు ముగుస్తుంది. వీరిలో 12,93,000 మం దికి మే 15లోగా సెకండ్‌ డోస్‌ వేయాల్సి ఉండగా.. ఇప్పటికే 4,63,000 మందికి వ్యాక్సిన్‌ వేసేశాం. ఇంకా 8,23,000 మందికిపైగా వేయాలి. కేంద్రం నుంచి వచ్చే డోసులు సెకండ్‌ డోసుకు సరిపోతాయి కాబట్టి కొత్తవారికి ఫస్ట్‌ డోస్‌ ఇచ్చే అవకాశం లేదు. 

శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్‌ ప్లాంట్లు
రాష్ట్రంలో 49 ఆస్పత్రుల్లో రూ.309 కోట్ల వ్యయంతో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్‌ ప్లాంట్ల (పీఎస్‌ఏ) ఏర్పాటుకు పరిపాలన ఆమోదం తెలిపాం. పీఎస్‌ఏ ప్లాంట్లను ఆయా ఆస్పత్రుల్లో ఉన్న బెడ్ల సామర్థ్యాన్ని బట్టి నిర్మించనున్నాం. మూడు నెలల్లో ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయి. రూ.180 కోట్లతో ప్లాంట్లు, సివిల్‌ వర్కులకు రూ.25 కోట్లు, 10 వేల అదనపు ఆక్సిజన్‌ పైప్‌లైన్ల కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తాం. 50 క్రయోజెనిక్‌ ట్యాంకర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించగా 25 ట్యాంకర్ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చాం. వీటికి రూ.46 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నాం. ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణంతో ఇక రవాణా, స్టోరేజ్‌ ఇబ్బందులు ఉండవు. 

పోస్టుభర్తీలో కోవిడ్‌ హెల్త్‌ వర్కర్లకు వెయిటేజ్‌
కోవిడ్‌ సేవల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టే నియామకాల్లో వెయిటేజ్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత కరోనా వ్యాప్తి కాలంలో పనిచేసిన హెల్త్‌ వర్కర్లకు 15 శాతం మేర వెయిటేజ్‌ ఇవ్వాలని మెమో జారీ చేశాం. ప్రస్తుతం విధులు నిర్వరిస్తున్న హెల్త్‌ వర్కర్లకు కూడా వెయిటేజ్‌ ఇస్తాం. ఈ జీవో, విధివిధానాలను శనివారం ప్రకటిస్తాం. 

కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 14,654 మంది..
కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ప్రస్తుతం 14,654 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు కొరత లేదు. గత 24 గంటల్లో 13,150 ఇంజక్షన్లు అందజేశాం. ప్రభుత్వాస్పత్రుల్లో 22,105 అందుబాటులో ఉన్నాయి. గత 24 గంటల్లో 104 కాల్‌ సెంటర్‌కు 17,062 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఇందులో 9,210 కాల్స్‌ వివిధ రకాల సమాచారం, 3,004 కాల్స్‌ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు, 1,706 కాల్స్‌ పరీక్షల ఫలితాల కోసం చేశారు.   

ఇంకా 2 లక్షల డోసులు రావాల్సి ఉంది.. 
రాష్ట్ర ప్రభుత్వం 9,91,000 కోవిషీల్డ్, 3,43,000 కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.45 కోట్లు చెల్లించింది. ఇప్పటికే కేటాయించిన కోవిషీల్డ్‌ డోసులతోపాటు మరో మూడున్నర లక్షల డోసులు అదనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, వాటిని మే మూడో వారంలో అందిస్తామని సీరం యాజమాన్యం ఈ–మెయిల్‌ ద్వారా తెలిపింది. ఈ అదనపు డోసులకు కూడా చెల్లింపులు చేయడానికి ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ఇచ్చింది. 3,43,000 కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లలో 1,43,000 డోసులు ఇప్పటికే వచ్చాయి. ఇంకా 2 లక్షల డోసులు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్లను 45 ఏళ్లకు పైబడినవారికే వేస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలిపాం. ఇదే విషయమై మరోసారి కేంద్రాన్ని కోరతాం.  

మరిన్ని వార్తలు