రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు!

8 Oct, 2020 12:45 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండి సూచనల ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రం దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఆ తదుపరి 24గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్‌ కె. కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలుల వీస్తాయని పేర్కొన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. 

కోస్తాకు వాయు గుండం..
శుక్రవారం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, కోస్తా ఆంధ్రాకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం త్వరితగతిన తన దిశను మార్చుకుంటూ వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ దశలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. అయితే కోస్తా ఆంధ్రాలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు