తిరుమల ఘాట్ రోడ్‌లో జాగ్రత్త..! వాహనదారులకు అధికారుల కీలక సూచనలు..

31 May, 2023 20:09 IST|Sakshi

వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల‌ తాకిడి పెరిగింది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి అధిక మొత్తంలో వాహనాలు వస్తున్నాయి.  రెండవ ఘాట్ రోడ్డు ద్వారా పది వేల వాహనాలు, మొదటి ఘాట్ రోడ్డులో ఎనిమిది వేల వాహనాలు వస్తున్నాయి. ఘాట్ రోడ్డుపై అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే తిరుమలకు రావాలని తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య సూచించారు.

ఫిట్నెస్ ఉండే వాహనాలను మాత్రమే ఘాట్ రోడ్డులో ఉపయోగించాలని ఎస్పీ మునిరామయ్య  కోరారు. అవగాహన లేని డ్రైవర్లు ఘాట్‌ రోడ్‌లో ముందు వెళ్లే వాహనాలను అధికమించే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని  చెప్పారు. ఘాట్ రోడ‍్లో వాహనాలు పక్కన పెట్టి సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయొద్దని కోరారు. దివ్య రామం వద్ద వాహనాలను ఆపి ఉండడం చేత ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. 

తిరుమలలో టైం లిమిటేషన్ కూడా తిరిగి పునరుద్ధరిస్తున్నామని ఎస్పీ మునిరామయ్య  చెప్పారు. రెండవ ఘాట్ రోడ్డులో 28 నిమిషాలు, మొదటి ఘాట్ రోడ్డులో 48 నిమిషాలు నియమించామని తెలిపారు. మొదటి ఘాట్ రోడ్డులో ఒకటో కిలోమీటరు వద్ద వాహనాలు ఆపుతున్నారని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్పెషల్ టీంగా ఏర్పడి బ్లాక్ స్పాట్స్  వద్ద వాహనాల డ్రైవర్లకు, భక్తులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

అలిపిరి వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలను  ఘాట్ రోడ్డులో నిషేధించడంపై ప్రతిపాదన పంపాం కానీ ఇంకా వాటిపై ఎలాంటి నిర్ణయం రాలేదని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డులో నిబంధనలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. 
ఇదీ చదవండి: తిరుపతి: టపాసుల నిల్వ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి

మరిన్ని వార్తలు