రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయ్‌

19 Nov, 2020 03:57 IST|Sakshi

గ్రామాలు, మన్యంలో పెరిగిన చలి 

మహారాణిపేట (విశాఖ దక్షిణ):  బంగాళాఖాతంలో ఈశాన్య, తూర్పు దిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయి. ఇవి తక్కువ ఎత్తులో వీయడం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పెద్ద ప్రభావం లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా, మన్యం ప్రాంతాల్లో ఎక్కువగా చలి పెరిగింది. మన్యంలో మంచు కురుస్తోంది. మేఘాలు ఆవరించడం వల్ల రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.

రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడులో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి మాల్దీవుల నుంచి ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణిలో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతోపాటు చల్లటి గాలుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో (గురు, శుక్రవారాల్లో) ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఒకటి రెండుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు