మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు శనివారం పెరిగాయి. సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఎండ తీవ్రతతోపాటు ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కాగా, ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు, మధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 3.1 కి.మీ వరకు విస్తరించింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో అంటే ఆదివారం, సోమవారం రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రాలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.