ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కేంద్రంలో బీజేపీ.. ఏపీలో వైఎస్సార్‌సీపీ..

21 Jan, 2022 12:23 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే కోరుకుంటున్నారని సీ ఓటర్‌– ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయన్స్‌ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సీ ఓటర్‌– ఇండియా టుడే సర్వే తేల్చిచెప్పింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు ప్రజాదరణ అణుమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా రాదని కుండబద్దలు కొట్టింది. సర్వే విశ్లేషణలో నిపుణులుగా పరిగణించే సీనియర్‌ జర్నలిస్టులు రాహుల్‌ కన్వల్‌ (ఇండియా టుడే గ్రూపు న్యూస్‌ డైరెక్టర్‌), రాజ్‌ చెంగప్ప (ఇండియా టుడే గ్రూపు ఎడిటోరియల్‌ డైరెక్టర్‌)లు ప్రజాదరణ విషయంలో జగన్‌కు తిరుగులేదని దీన్ని బట్టి తెలుస్తోందని విశ్లేషించారు.    

చదవండి: (ఎన్నికలొస్తే... కేంద్రంలో మళ్లీ బీజేపీయే)

మరిన్ని వార్తలు