అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటీ

9 Aug, 2020 20:50 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏలూరు రోడ్డులోని స్వర్ణప్యాలెస్‌లో రమేష్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆదివారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణకు జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) నేతృత్వంలో కమిటీని నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ ఏఎండి ఇంతియాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 10 మంది మరణానికి, 18 మంది క్షతగాత్రులైన సంఘటనకు దారితీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను విచారణ చేసేందుకు జేసీ ఎల్‌ శివశంకర్ నేతృత్వంలో విజయవాడ సబ్‌కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. జి.గీతాబాయ్, వీఎంసీకి చెందిన ఆర్‌ఎఫ్‌వో టి ఉదయకుమార్, సీపీడీసీఎల్‌ డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌తో కూడిన కమిటీని నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలు, పరిస్థితులతో పాటు భద్రతా నిబంధనలు, ఆసుపత్రి నిర్వహణ లోపాలు, వసూలు చేసిన అధిక ఫీజుల ఆరోపణలపై దృష్టి సారించాలని కమిటీని ఆదేశించారు. విచారణ పూర్తి చేసి కమిటీ తన నివేదికను రెండు రోజుల్లో సమర్పించాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు