రెండో రోజు ఇంటర్వ్యూలకు 462 మంది హాజరు

21 Oct, 2022 08:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైద్య శాఖలోని డీఎంఈ, ఏపీవీవీపీ విభాగాల్లో స్పెషలిస్ట్, సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల నియామకానికి నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు గురువారం రెండో రోజు 462 మంది వైద్యులు హాజరయ్యారు. డీఎంఈలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఏపీవీవీపీలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల నియామకానికి బుధవారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రెండోరోజు డీఎంఈలో 61 పోస్టులు నోటిఫై చేయగా 304 మంది, ఏపీవీవీపీలో 137 పోస్టులు నోటిఫై చేయగా 158 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తులను పరిశీలించి మెరిట్‌ జాబితాలు ప్రదర్శించి, వీటిపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా పోస్టింగ్‌లు ఇచ్చారు.  

తొలి రోజు 161 పోస్టులు భర్తీ     
తొలి రోజైన బుధవారం అర్ధరాత్రి వరకు ఇంటర్వ్యూలు కొనసాగాయి. పలువురు అభ్యర్థులకు గురువారం పోస్టింగ్‌లు ఇచ్చారు. తొలి రోజు 161 పోస్టులు భర్తీ అయినట్టు ఏపీవీవీపీ కమిషనర్, ఇన్‌చార్జి డీఎంఈ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. తొలి రోజు డీఎంఈలో 96 పోస్టులు నోటిఫై చేయగా 45, ఏపీవీవీపీలో 173 పోస్టులు నోటిఫై చేయగా 116 భర్తీ చేశామన్నారు. శుక్రవారం కూడా  ఇంటర్వ్యూలు కొనసాగుతాయి.

మరిన్ని వార్తలు