ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైళ్లు

7 May, 2022 10:17 IST|Sakshi

ఆగ్రా, మధుర, వైష్ణోదేవి దర్శనం, 

అమృత్‌సర్‌ యాత్రకు ప్రత్యేక ప్యాకేజీ  

సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ):  ఉత్తర భారతదేశ యాత్రకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు విజయవాడ ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్‌ టి.మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం రైల్వే స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ స్వదేశ్‌ దర్శన్‌లో భాగంగా ఆగ్రా, మధుర, వైష్ణోదేవి దర్శనం, అమృత్‌సర్‌ యాత్రకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ నెల 27న రేణిగుంట–తిరుపతి నుంచి బయల్దేరే రైలు విజయవాడ, సికింద్రాబాద్‌లో ప్రయాణికులను ఎక్కించుకుని ఏడు రాత్రులు, 8 పగళ్లు ప్రయాణించి వచ్చే నెల 3న గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు. భోజన వసతితో పాటు స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణ ధర రూ.18,120, థర్డ్‌ ఏసీ టికెట్‌ ధర రూ.22,165గా ఉంటుందన్నారు.

వారణాసి, ప్రయాగ సంగమ్, గయ యాత్రకు సెప్టెంబర్‌ 15న సికింద్రాబాద్‌ నుంచి మహాలయ పిండ్‌దాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 5 రాత్రులు, 6 పగళ్లు స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణ ధర రూ.14,485, థర్డ్‌ ఏసీ రూ.18,785గా నిర్ణయించినట్టు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌లో ప్రయాణికులు రైలు ఎక్కే సౌకర్యం ఉంటుందన్నారు. మరోవైపు విజయ గోవిందం ఎక్స్‌ప్రెస్‌ పేరుతో తిరుమల, తిరుచానూరుకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నామన్నారు. 2 రాత్రులు, 3 పగళ్లు ప్రయాణ టికెట్‌ ధర విజయవాడ నుంచి రూ.3,410, రాజమండ్రి–సామర్లకోట నుంచి రూ.3,690 ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఆసక్తి గలవారు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా 8287932312, 9701360675 ఫోన్‌ నంబర్లు లేదా విజయవాడ రైల్వే స్టేషన్‌లోని కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా కోరారు.     

పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రత్యేక రైళ్లు
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ నిర్వహించే నాన్‌–టెక్నికల్‌ కేటగిరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ప్రాంతీయ విమాన ప్యాకేజీలు 
ఐఆర్‌సీటీసీ హైదరాబాద్‌ నుంచి ప్రాంతీయ విమాన టూర్‌ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలి పారు. ఈ నెల 27న అల్టిమేట్‌ ఉత్తరాఖండ్‌ పేరుతో డెహ్రాడూన్, హరిద్వార్, ముస్సోరి, రుషికేష్‌ చుట్టివ చ్చేలా రూ.23,635తో ప్రత్యేక ప్యాకేజీ రూపొందించామన్నారు. 29న రాయల్‌ నేపాల్‌యాత్రలో భాగం గా ఖాట్మండు, పోఖరా ప్రయాణానికి రూ.40 వేల నుంచి టికెట్‌ ధర ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 12, 14, 19, 21, 26, 28 తేదీల్లో తిరుపతి, కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుమలతో కలిపి రూ.12,260తో విమాన ప్యాకేజీని నిర్వహిస్తున్నట్టు వివరించారు.

చదవండి: మళ్లీ పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర.. నెల గ్యాప్‌ తర్వాత రూ.50 పెంపు 

మరిన్ని వార్తలు