మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

6 Nov, 2020 15:18 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: ఇస్రో మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరి కోట నుంచి శనివారం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ-49 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ-49 రాకెట్‌ ద్వారా నింగిలోకి పది ఉపగ్రహాలను పంపనున్నారు. ఈఓఎస్‌-01 అనే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌తో పాటు మరో 9 విదేశీ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించనుంది. ఇప్పటికే ఇస్రో చైర్మన్‌, శాస్త్రవేత్తలు శ్రీహరికోట షార్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీహరి కోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. కరోనా నేపథ్యంలో శాస్త్రవేత్తలు మినహా మిగతా ఎవ్వరికీ ఇస్రో అనుమతించడం లేదు. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 51వ ప్రయోగం కాగా, షార్‌ నుంచి 76వ ప్రయోగం కావడం గమనార్హం.  (ఏపీలో పెట్టుబడులకు తైవాన్‌ కంపెనీల ఆసక్తి)

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి రేపు సాయంత్రం 3.02 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ49 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ నమూనా రాకెట్‌కు తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్త్రో శాస్ర్తవేత్తల బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శాటిలైట్ ద్వారా భారత్‌కు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈఓఎస్‌–01) అనే ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 చిన్న తరహా ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది ఇస్రో. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ను రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. తొలుత ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా శనివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు