చేదోడు ద్వారానే రాష్ట్రం పరిగెడుతోంది.. జీఎస్‌డీపీ గ్రోత్‌ రేట్‌లో ఏపీనే అగ్రగామి: సీఎం జగన్‌

30 Jan, 2023 12:26 IST|Sakshi

సాక్షి, పల్నాడు: నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme)కింద లబ్దిదారులకు మూడవ విడత సాయాన్ని ఇవాళ(సోమవారం) జిల్లాలోని వినుకొండలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ..

‘‘వెనకబడిన కులాలను, వర్గాలను.. వెన్నెముక కులాలుగా మారుస్తామని మాట ఇచ్చాం. ఈ మూడు ఏళ్లలో నవరత్నాలులోని ప్రతీ పథకాన్ని, సంక్షేమ పథకాల్లోని ప్రతీ పథకాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతీ వర్గాల కుటుంబాలకు మేలు చేసేలా మన అందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ వచ్చింది.  ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో భాగంగా.. సొంత షాప్‌ ఉన్న రజక సోదరుడికి, నాయీబ్రాహ్మణుడికి, దర్జీ అక్కాచెల్లెలకు ఏటా పది వేల రూపాయల ఆర్థిక సాయం చేసేలా జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చాం. 

లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాం. వివక్ష లేకుండా పారదర్శకంగా అందజేస్తున్నాం. వరుసగా ఈ మూడేళ్లలో అక్షరాల మూడు లక్షల ముప్పై వేల మందికి మంచి చేస్తూ.. నేడు రూ. 330 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. మొత్తంగా.. జగనన్న చేదోడు కార్యక్రమంతో రూ. 927 కోట్లు జమ చేసినట్లు అవుతుందని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు జరుగుతోంది. మొత్తం 43 నెలల కాలంలోనే నేరుగా 1.92 లక్షల కోట్లు అందించామని, టీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.3 లక్షల కోట్లు అందించామని సీఎం జగన్‌ వినుకొండ వేదిక నుంచి ప్రకటించారు. 

ఇవాళ మన రాష్ట్రం దేశంలోనే జీడీపీ జీఎస్‌డీపీ(గ్రాస్‌ స్టేట్‌ డెమోస్టిక్‌ ప్రొడక్ట్‌)  ప్రకారం.. మన గ్రోత్‌ రేట్‌ 11.43 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని గర్వం చెప్తున్నానని సీఎం జగన్‌ పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా పరిగెడుతోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితిని పట్టించుకోకుండా.. గిట్టనివాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదంతా గమనించాలని ఏపీ ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. ప్రతీ రంగంలో ముందుకు దూసుకెళ్తున్నప్పుడే ఇలాంటి ఘనత సాధ్యమవుతుందన్నారు. రైతులు, అక్కాచెల్లెమ్మలు.. ఇలా అందరికీ సంక్షేమ పథకాల ద్వారా సాయం, చేయూత ఇస్తున్నామని.. తద్వారా వాళ్లు వాళ్ల కాళ్ల మీద నిలబడుతూ రాష్ట్రాన్ని ముందుకు పరిగెట్టిస్తున్నారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు