ఏకరీతిన హరిత నగరాల ప్రధాన రోడ్లు 

17 Jul, 2022 03:48 IST|Sakshi

తొలుత విజయవాడ – గన్నవరం విమానాశ్రయం రోడ్డు అభివృద్ధి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జగనన్న హరిత నగరాల కింద తొలి విడతలో ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో ప్రథాన రోడ్లను ఒకేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం విజయవాడ విమానాశ్రయ రోడ్డును నమూనాగా తీసుకోనున్నారు. ఈ మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారు. ఈ రహదారిపై ఎలాంటి మొక్కలు నాటుతారో మిగతా నగరాల్లోనూ ఒక ప్రధాన మార్గాన్ని అలాగే తయారు చేయాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ విభాగాలు  నిర్ణయించాయి. నగర, పట్టణాల్లోని ప్రధాన మీడియన్స్‌లో అభివృద్ధి చేసే ఈ ప్లాంటేషన్‌ ద్వారా మొత్తం 1.50 లక్షల చ.మీ మేర పచ్చదనం అదనంగా అందుబాటులోకి వస్తుంది.

ఇతర రాష్ట్రాలకు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే గన్నవరం విమానాశ్రయం రోడ్డును అందంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ రోడ్డు విజయవాడ రామవరప్పాడు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 13.82 కిలోమీటర్లు ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు కొంత కాలం పాటు కృత్రిమ అందాలు, రంగుల వెలుగుల్లో కనిపించింది. ఇకపై సహజమైన పూల మొక్కలు, పచ్చని చెట్లతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

గత నెలలో పురపాలక, పట్టణాభివృద్ధి విభాగంపై సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఈ రోడ్డును రూ.5.02 కోట్లతో ప్రకృతి అందాన్నిచ్చే మొక్కలతో నింపేలా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటి దాకా జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఈ రోడ్డును తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చి, ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌కు అప్పగించారు.  

మరిన్ని వార్తలు