జగనన్న విదేశీ విద్యాదీవెన.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

30 Sep, 2022 13:15 IST|Sakshi

నెల్లూరు(వేదాయపాళెం): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురువారం జిల్లా బీసీ సంక్షేమశాఖ సాధికారత అధికారి వై.వెంకటయ్య తెలిపారు. విద్యార్థులను అంతర్జాతీయ విద్యాప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది పోటీ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
చదవండి: వీఆర్‌వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం వరంగా మారింది. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులకు సంబంధించి ఈ పథకంతో మేలు చేకూర్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిభకు పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు రూపొందించింది. వార్షిక ఆదాయ పరిమితిని పెంచి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కూడా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టింది. క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో ప్రపంచంలో టాప్‌ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

క్యూస్‌ వరల్డ్‌ ర్యాకింగ్‌ ప్రకారం టాప్‌ 100 యూనివర్సిటీల్లో సీటు సాధించే విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. టాప్‌ 100 నుంచి 200 ర్యాకింగ్‌లో ఉన్న యూనివర్సిటీల్లో సీటు పొందిన వారికి రూ.50 లక్షల వరకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేస్తుంది. తద్వారా విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడంతోపాటు నాణ్యతతో కూడిన ఉన్నత చదువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా ఫీజురీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేయనున్నారు. డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్‌లో 60 శాతం మార్కులు, తత్సమాన గ్రేడ్‌ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్‌ కోర్సులకు నీట్‌లో అర్హత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ఈ ఆర్థికసాయం ప్రభుత్వం అందజేస్తుంది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజురీయింబర్స్‌మెంట్‌ జమ చేస్తారు.

దరఖాస్తుకు నేడు ఆఖరు  
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు ప్రభుత్వం గుర్తించిన 200 యూనివర్సిటీల్లో సీటు సాధించి ఉండాలి. కులం, ఆదాయ సర్టిఫికెట్లు, మార్కులిస్టు తదితర వివరాలతో ఈ నెల 30వ తేదీ లోపు http:// jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సద్వినియోగం చేసుకోండి 
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 30 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఈ పథకం వర్తింపజేస్తోంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలి. 
– వై.వెంకటయ్య, జిల్లా బీసీ సంక్షేమశాఖ, సాధికారత అధికారి  

మరిన్ని వార్తలు