టీటీడీ ఈవో డాక్టర్ జవహర్రెడ్డి
తిరుపతి ఎడ్యుకేషన్: హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో బుధవారం సమరసత సేవా ఫౌండేషన్, సంస్కృతి సంవర్ధిని సంస్థల ప్రతినిధులు, ధర్మప్రచార పరిషత్ అధికారులతో ఈవో సమావేశమయ్యారు.
ఆయన మాట్లాడుతూ సమరసత సేవా ఫౌండేషన్, సంస్కృతి సంవర్ధిని సంస్థల ద్వారా రెండో విడతలో 500 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు. సమరసత సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న బాలవికాస కేంద్రాలకు ఆధ్యాత్మికత, దేశభక్తిని పెంపొందించే పుస్తకాలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. నూతనంగా నిర్మించే ఒక్కో ఆలయానికి టీటీడీ రూ.10 లక్షల వరకు సమకూర్చనున్నట్లు ఈవో తెలిపారు.