మా వాళ్లు రాక్షసులు.. మీ రక్తం తాగుతారు: జేసీ

10 Oct, 2020 04:09 IST|Sakshi
భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి

అధికారులనుద్దేశించి జేసీ బెదిరింపు వ్యాఖ్యలు 

తాడిపత్రి అర్బన్‌: ‘‘మా అనుచరులు రాక్షసులు. పచ్చి రక్తం తాగేవాళ్లు నా చుట్టూ ఉన్నారు. వాళ్లు మీ రక్తాన్ని పులి, సింహాల్లాగా తాగుతారు.’’ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అధికారులను బెదిరించే ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మమ్మల్ని అధికారులు సన్మానిస్తే, మేము అధికారంలోకి వచ్చాక వారిని రెట్టింపు స్థాయిలో సన్మానిస్తాం అంటూ వ్యంగ్యంగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో జేసీ దివాకర్‌రెడ్డి నిర్వహిస్తున్న క్వారీలో అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.

ఈ విషయమై శుక్రవారం తాడిపత్రిలోని భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి వచ్చిన జేసీ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తన క్వారీలను అధికారులు తనిఖీ చేస్తున్నారని, రాయల్టీల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అధికారులు ట్రాన్ఫర్లకు బయపడి తన గనులు మూసేయాలని చూస్తున్నారనీ, తనకు అన్నం దొరకకుండా చేసి చంపాలనుకుంటున్నారనీ ఆరోపించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీఐ తేజోమూర్తిని ‘మీరు కూడా వెళ్లారా మా క్వారీ వద్దకు అంటూ’ జేసీ ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పకపోవడంతో.. ‘నీ సర్వీస్‌ ఇంకా ఎన్ని రోజులు ఉంది? మేము అధికారంలోకి వస్తే మీ పని పనిపడతాం’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.  

మరిన్ని వార్తలు