నేటి నుంచి జేఈఈ 4వ విడత

26 Aug, 2021 05:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ–మెయిన్‌) 2021 4వ సెషన్‌ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే లో జరగాల్సిన ఈ పరీక్షలు కోవిడ్‌ కారణంగా వాయిదా పడ్డాయి. కంప్యూటరాధారితంగా జరిగే ఈ పరీక్షలు సెప్టెంబర్‌ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 7 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు.

తొలిరోజు పేపర్‌–2 అయిన బీ.ఆర్క్, బీ.ప్లానింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. బీటెక్‌ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఆ తరువాత వరుసగా నాలుగు రోజుల పాటు ఆగస్టు 27, 31, సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా జరుగుతాయి. జేఈఈ మెయిన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ సంవత్సరం నుంచి నాలుగు సెషన్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో సెషన్‌ పూర్తి అయిన తరువాత సెప్టెంబర్‌ మూడో వారంలో తుది విడత ఫలితాలను అభ్యర్థుల ర్యాంకులతో సహా ఎన్‌టీఏ ప్రకటించనుంది.  

మరిన్ని వార్తలు