నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రాథమిక ‘కీ’

29 Sep, 2020 04:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2020 పరీక్ష ప్రాథమిక ‘కీ’ మంగళవారం వెలువడనుంది. ఆదివారం నిర్వహించిన పేపర్‌–1, పేపర్‌–2 ప్రశ్నపత్రాల కాపీలను పరీక్ష నిర్వహణ సంస్థ.. ఐఐటీ– ఢిల్లీ సోమవారం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కీ విడుదల చేశాక విద్యార్థుల నుంచి ఈ నెల 30 సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది. అనంతరం అక్టోబర్‌ 5న తుది ‘కీ’ని, ర్యాంకుల జాబితాను విడుదల చేయనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2020కు 2.5 లక్షల మంది అర్హత సాధించగా 1.60 లక్షల మంది మాత్రమే పరీక్షకు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. 

► వీరిలో 96 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్‌–1కు 1.51 లక్షలు, పేపర్‌ 2కు 1.50 లక్షల మంది హాజరయ్యారు. 
► అక్టోబర్‌ 6 నుంచి జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అ«థారిటీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్‌ 9 వరకు మొత్తం 6 విడతల కౌన్సెలింగ్‌ ద్వారా మెరిట్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఒకే రకమైన మార్కులతో సమానంగా ఉంటే నెగెటివ్‌ సమాధానాలివ్వని, ఎక్కువ పాజిటివ్‌ మార్కులున్న అభ్యర్థులకు మెరుగైన ర్యాంక్‌ ఇస్తారు.అందులోనూ సరిసమానంగా అభ్యర్థులుంటే వారిలో గణితంలో ఎక్కువ స్కోరు ఉన్నవారికి అధిక ర్యాంకు కేటాయిస్తారు. 
► ఆ తర్వాత భౌతికశాస్త్రం మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సమాన స్థాయిలోఅభ్యర్థులుంటే నిబంధనల మేరకు ర్యాంకులిస్తారు.   

మరిన్ని వార్తలు