భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి

19 Sep, 2020 12:26 IST|Sakshi

అనంతపురంలో జర్నలిస్ట్‌ సంఘాల ఆందోళన

సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పుపై జర్నలిస్ట్‌ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మీడియాపై ఆంక్షలు నిరసిస్తూ శనివారం అనంతపురంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. మీడియాకు జడ్జిలు సంకెళ్లు వేయటమా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ జర్నలిస్ట్‌ డెవలప్‌మెంట్‌ సోసైటీ అధ్యక్షుడు మచ్ఛా రామలింగారెడ్డి మాట్లాడుతూ.. అమరావతి భూ కుంభకోణంలో ఏసీబీ ఎఫ్ఐఆర్ సమాచారాన్ని మీడియాల్లో ఇవ్వకూడదని, ఏపీ హైకోర్టు ఆంక్షలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని తెలిపారు. సాక్షాత్తు హైకోర్టే పత్రికా స్వేచ్ఛకు తూట్లు పొడిస్తే ఎలా అని ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలన్నారు. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.(చదవండి: టీడీపీ లాయర్లే జడ్జిలు)

భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాలి..
ఏపీ హైకోర్టు తీర్పు అనేక అనుమానాలకు తావిస్తోందని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులేనని, మాజీ అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు జడ్జి కూతుళ్లపై నమోదైన కేసును విచారణ చేయకూడదా? అని ఆయన  ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుపై కేంద్రం, సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. ఏపీలో రాజ్యాంగ స్ఫూర్తిని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని గోపాల్‌రెడ్డి కోరారు. (చదవండి: బలమైన శక్తుల పేర్లు ఉన్నందు వల్లేనా!?)

మరిన్ని వార్తలు