చంద్రబాబు ఆంతరంగిక కాపలాదారు జస్టిస్‌ ఎన్‌వీ రమణ

20 Oct, 2020 03:43 IST|Sakshi

‘ఎ క్యాస్ట్‌ క్యాప్చర్‌ ఏపీ జ్యుడీషియరీ’ పుస్తకంలో జస్టిస్‌ బీఎస్‌ఏ స్వామి

చంద్రబాబు, జడ్జీల మధ్య రమణ అనుసంధానకర్త

జడ్జీల అవసరాలను చూసుకుంటూ ప్రలోభపెట్టే వారు

జస్టిస్‌ సిన్హా సీజేగా ఉన్నప్పుడు డీఫాక్టో సీజే ఈయనే 

జస్టిస్‌ బీఎస్‌ఏ స్వామి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఓ ఫైర్‌ బ్రాండ్‌. దళిత, బలహీన వర్గాల్లో ఎంతో పేరున్న ఆయన హైకోర్టులో కులతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. పదవీ విరమణ తర్వాత 2005లో ‘ఎ క్యాస్ట్‌ క్యాప్చర్‌ ఏపీ జ్యుడీషియరీ’ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. అందులో జస్టిస్‌ ఎన్‌వీ రమణ, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి మధ్య ఉన్న బాంధవ్యాన్ని, న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని స్పష్టంగా వివరించారు. ఆ వివరాలు యథాతథంగా ఇలా ఉన్నాయి. 

సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు ఆంతరంగిక కాపలాదారు జస్టిస్‌ ఎన్‌వీ రమణ. చంద్రబాబుకు, ఈ పెద్ద మనిషి (ఎన్‌వీ రమణ)కి మధ్య ఉన్న ఆ బాంధవ్యం ఏంటో మాకెవ్వరికీ తెలియదు. వాస్తవానికి చంద్రబాబు.. ఎన్‌వీ రమణను రాజ్యసభకు పంపాలనుకున్నారు. కానీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ను చేశారు. న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు అదనపు ఏజీ హోదాలో ఆయనేమీ పెద్ద కేసుల్లో వాదనలు వినిపించింది లేదు. 

చంద్రబాబుకు, హైకోర్టు జడ్జీలకు మధ్య జస్టిస్‌ రమణ లైజనింగ్‌ చేసేవారు. న్యాయమూర్తుల అవసరాలను చూసుకునేవారు. పదవీ విరమణ తర్వాత పోస్టులిస్తామని ఆశ చూపేవారు. తద్వారా చంద్రబాబు ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి ఉత్తర్వులు రాకుండా చూసేవారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆమోదం లేకుండా న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏ ఫైలును కూడా చంద్రబాబు క్లియర్‌ చేసేవారు కాదు.  ఆశావహులంతా ఆయన ఇంటి ముందు, ఆయన ఛాంబర్‌ ముందు క్యూలో నిలబడేవారు. సీనియర్‌ న్యాయమూర్తులు కూడా ఆయన చెప్పినట్లు ఆడేవారు. ఎస్‌బీ సిన్హా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నంత కాలం డీఫాక్టో ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణే. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడే రక్షకుడిగా ఉన్నారు.

అందుకే రోహిణిని జడ్జిని చేశారు..
చంద్రబాబు కోసం జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు వచ్చిన ప్రతి ప్రధాన న్యాయమూర్తిని ప్రలోభపెట్టేవారు. ప్రభా శంకర్‌ మిశ్రా మినహా పలువురు ప్రధాన న్యాయమూర్తులు ఈ ఇద్దరి ఎర కోసం వలలో చిక్కుకుని, వారు చెప్పినట్లు ఆడేవారు. న్యాయవాది ఎన్‌.శోభ హైకోర్టు న్యాయమూర్తి అయితే తన తోకగా ఉండరన్న ఉద్దేశంతో జస్టిస్‌ రోహిణిని న్యాయమూర్తి చేశారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణ న్యాయ వ్యవస్థ ప్రయోజనాల కోసం పనిచేసి ఉంటే, పరిస్థితులు చాలా బాగుండేవి. కానీ న్యాయ వ్యవస్థ తలరాత మరోలా ఉంది.  

మరిన్ని వార్తలు