'ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుంది'

24 Mar, 2021 15:12 IST|Sakshi

రాజ్యసభలో మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి

తిరుమలపై జిఎస్టి  ఉపసంహరించుకోవాలి

ఢిల్లీ : కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా తగ్గుతోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే కేంద్ర పన్నుల వాటా క్రమేణా తగ్గుతోందని తెలిపారు. జనాభాకు ఎక్కువ ప్రాధన్యాత ఇచ్చిన పన్నుల వాటాలో కోత పెడుతున్నారని, జనాభాను నియంత్రణ చేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారని పేర్కొన్నారు.జనాభా ఆధారంగా పన్నుల వాటాను నిర్ధారించే పద్ధతిని మార్చుకోవాలని,ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుందన్నారు.విభజన చట్టంలో ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ సరైన నిర్ణయం కాదని, ప్రభుత్వ వనరుల సమీకరణ కోసం సంస్థ నమ్మడం మంచిది కాదని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రభుత్వం వనరులు సమీకరించుకోవాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరసన ప్రకటిస్తున్నా,  కేంద్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 'ఎన్నో త్యాగాల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు. 2015 వరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లోనే ఉంది. రుణాలను వాటాలుగా మారిస్తే ప్లాంట్ మళ్ళీ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అని విజయసాయిరెడ్డి నినదించారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏడాది 120 కోట్ల రూపాయల జిఎస్టి చెల్లిస్తోందని, హిందుత్వకు తామే ప్రతినిధులం అని చెప్పుకునే బిజెపి ప్రభుత్వం దేవాలయాలపై పన్నులు ఉపసంహరించుకోవాలని విజయసాయి రెడ్డి డిమాండ్‌ చేశారు. 'భక్తులు ఉండే గదుల పైన సైతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాణిజ్య సంస్థ కాదు..లాభార్జన కోసం అక్కడ కార్యక్రమాలు జరగడం లేదు దేవుడి సేవ కోసమే భక్తులు ఉన్నారు. జీఎస్టీ వ్యవస్థ కంటే ముందు టిటిడిపై పన్నుల భారం లేదు.కేంద్ర ప్రభుత్వం ఇకనైనా తిరుమలపై జిఎస్టి  ఉపసంహరించుకోవాలి' అని విజయసాయిరెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

చదవండి : ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే
ప్రత్యేక హోదాపై ఒత్తిడి పెంచిన వైఎస్సార్‌సీపీ

మరిన్ని వార్తలు