దక్షిణ భారత అజ్మీర్‌.. కడప అమీన్‌పీర్‌ దర్గా

6 Dec, 2022 10:01 IST|Sakshi

7న గంధం, 8న  ఉరుసు 

12వ తేదీ వరకు ఉత్సవాలు 

కడప కల్చరల్‌: ఇస్లాం సూఫీ తత్వాన్ని బోధిస్తూ కులమతాలకు అతీతంగా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచుతూ మానవత్వానికే పెద్దపీట వేస్తున్న కడప అమీన్‌పీర్‌ దర్గాకు విశిష్టమైన పేరుంది. దీన్ని దక్షిణ భారత అజ్మీర్‌గా కూడా కొనియాడుతారు. ఈ దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలు ఈనెల 7, 8 తేదీలలో నిర్వహిస్తారు. 12వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. 

చరిత్ర.. 16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్‌ ప్రాంతం నుంచి మహా ప్రవక్త (సొ.అ.వ) వంశీయులైన ఖ్వాజాయే ఖాజుగా నాయబె రసూల్‌ అతాయే రసూలుల్లాహ్‌ హజరత్‌ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లామాలిక్‌ సాహెబ్‌ తన సతీమణి, కుమారులు హజరత్‌ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్,  హజరత్‌ అహ్మద్‌ హుసేనీ సాహెబ్‌తోపాటు భక్తగణంతో ఈ ప్రాంతానికి వచ్చారు. ఆధ్యాత్మిక బోధనలతో అందరినీ ఆకట్టుకున్నారు. నాటి నవాబులు వీరి మహిమలను గమనించి ప్రియ భక్తులు అయ్యారు. వారి కోరిక మేరకు గురువులు కడప నగరంలో స్థిరపడ్డారు. 

జీవసమాధి.. హజరత్‌ పీరుల్లా మాలిక్‌ సాహెబ్‌ పట్ల ఈర‡్ష్యతో స్థానికుల్లో కొందరు సవాలు విసిరారు. దాని ప్రకారం ఆయన జీవ సమాధి అయి మూడవరోజున దర్శనం ఇవ్వడంతో శత్రువులు సైతం ప్రియమైన భక్తులుగా మారారు.  కాగా,  హజరత్‌ అమీనుల్లా హుసేనీ సాహెబ్‌ 10వ పీఠాధిపతిగా వ్యవహరించారు. ఆయన పేరుతోనే దర్గాను అమీన్‌పీర్‌ సాహెబ్‌ దర్గాగా పేర్కొనేవారు. కాలక్రమంలో అది అమీన్‌పీర్‌ దర్గాగా మారింది. ప్రస్తుతం దర్గా 11వ పీఠాధిపతి హజరత్‌ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ నిర్వహణలో ఉంది. దర్గాలో మొత్తం గురువులు, వారి వారసుల పేరిట ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం యేటా మొత్తం 11 చిన్న ఉరుసులు, గంధం ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం పెద్ద ఉరుసును వారం రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.  పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పలు ఇస్లామిక్‌ దేశాల నుంచి కూడా ఈ ఉరుసుకు హాజరవుతారు. 

మరిన్ని వార్తలు