AP: కోవిడ్‌ అనాథలకు అండగా ప్రభుత్వం

31 Jul, 2021 08:22 IST|Sakshi
ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లు అందుకున్న పిల్లలతో కలెక్టర్‌ విజయరామరాజు 

నలుగురు చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం

కడప సిటీ:  కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు మృతి చెందటంతో అనాథలుగా మిగిలిన పిల్లల భవిష్యత్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించి కొండంత అండగా నిలుస్తోందని వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజు అన్నారు. జిల్లాలో కరోనా వల్ల తల్లిదండ్రులు మృతి చెందగా.. అనాథలైన మూడు కుటుంబాల్లోని నలుగురు చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేసిందని ఆయన తెలిపారు.

ఆ మొత్తాలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన బాండ్లను సంబంధిత చిన్నారులకు కలెక్టర్‌ తన చాంబర్‌లో శుక్రవారం అందజేశారు. బాండ్లను అందుకున్న వారిలో అట్లూరు మండలం ముతుకూరుకు చెందిన అరవ రామిరెడ్డి, రమాదేవి పిల్లలు మని (14), వెంకట శ్రీనాథ్‌రెడ్డి (16), ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లెకు చెందిన షేక్‌ సయ్యద్, మహబూబ్‌బీ కుమార్తె కమాల్‌బీ (16), బి.మఠం మండలం సోమిరెడ్డిపల్లెకు చెందిన జి.ప్రకాశం, ఫాతిమా దంపతుల కుమార్తె గొల్లపల్లె భవాని (17) ఉన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌ కారణంతో తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు లేదా ఇద్దరూ మరణిస్తే.. 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తోందన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్‌ బీమా, ఇతర బీమాలతో సంబంధం లేకుండా ఈ మొత్తం అందుతుందని తెలిపారు. సహాయం అందుకున్న వారంతా బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించి మంచి పేరు తెచ్చుకోవాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు