దేశానికే ఆదర్శంగా నిలిచాం

15 Jul, 2022 05:39 IST|Sakshi

వ్యవసాయ మంత్రుల జాతీయ స్థాయి సదస్సులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత మూడేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలిచామ ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తెచ్చే లక్ష్యంతో గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)కు జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతు న్నాయని తెలిపారు.

బెంగళూరులో జరుగు తున్న వ్యవసాయ, ఉద్యాన మంత్రుల రెండు రోజుల జాతీయ సదస్సులో గురువారం మంత్రి కాకాణి మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ‘వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా మూడు విడతలుగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నాం. సీడ్‌ టు సేల్‌’ కాన్సెప్ట్‌తో ఆర్బీకేల ద్వారా దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచాం. నీతి ఆయోగ్, ఆర్బీఐ, నాబార్డు  వంటి అనేక ప్రముఖ సంస్థలు, తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఆర్బీకే సేవలను ప్రశంసించాయి.

పలు ప్రఖ్యాత సంస్థలు మాతో పనిచేసేందుకు ముందుకు వచ్చాయి’ అని చెప్పారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్,  మన్సుఖ్‌ మాండవియా, కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై, ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఇన్‌చార్జి కమిషనర్‌ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు