‘కొత్త’ ఆవిష్కర్త.. బీటెక్‌ చదువుతూనే..

23 Apr, 2022 09:25 IST|Sakshi
సాధించిన సర్టిఫికెట్లతో లోక్‌నాథ్‌

ప్రయోగాలతో ఆకట్టుకుంటున్న విద్యార్థి లోక్‌నాథ్‌ 

వాహన ప్రమాదాలను ముందే పసిగట్టే సిస్టమ్‌ 

వాతావరణ మార్పులను హెచ్చరించే పరికరం 

బీటెక్‌ చదువుతూనే ప్రయోగాలకు రూపకల్పన

పిఠాపురం(కాకినాడ జిల్లా): వాహనంలో వెళ్తున్నప్పుడు ముంచుకొచ్చే ప్రమాదాన్ని ముందుగా గుర్తిస్తే.. మన ప్రమేయం లేకుండానే ప్రమాదాన్ని గుర్తించి వాహనం దానంతట అదే ఆగిపోతే.. ప్రతి వాహనదారుడు ఇలాంటి పరికరాలు తన వాహనంలో ఉండాలని కోరుకుంటాడు. బీటెక్‌ చదువుతున్న కొత్త లోక్‌నాథ్‌ ఇది గుర్తించి తన మెదడుకు పదును పెట్టాడు. చిన్న వయసులోనే అద్భుత ఆవిష్కరణ చేశాడు.

చదవండి: AP: ‘ఆరోగ్య’ వ్యవసాయం

అదే ఆటోమేటిక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌. వాహనంపై రకరకాల ఆలోచనలతో వెళుతుంటే ఎదురుగా వేగంగా వాహనాన్ని గుర్తించలేక ప్రమాదం జరగొచ్చు. లేదా ఏవైనా జంతువులు అకస్మాత్తుగా అడ్డం పడొచ్చు. తప్పించుకునే లోపే ప్రమాదం ఎదురు కావచ్చు. ఇలాంటి వాటిని అధిగమించడానికి లోక్‌నాథ్‌.. ఓ సెన్సార్‌ సిస్టమ్‌ రూపొందించాడు. వాహనానికి అమర్చే ఈ సెన్సార్‌కు కొంత పరిధి ఉంటుంది. అందులోకి ఏదైనా వాహనం, జంతువులు, ఇతర ప్రమాదకర అంశాలు వస్తే గుర్తిస్తుంది. వెంటనే ఆటోమేటిక్‌గా బ్రేక్‌ సిస్టమ్‌ పని చేసి, వాహనం వేగం తగ్గిపోతుంది. ఆ తర్వాత వాహనం ఆగిపోతుంది. తద్వారా ప్రాణాపాయం తప్పుతుంది.

మధ్యతరగతి కుటుంబం నుంచి 
కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన లోక్‌నాథ్‌ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కొత్త సునీల్, సుజాత దంపతుల కుమారుడు. తండ్రి ఓ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలో అకౌంటెంట్‌. ప్రస్తుతం లోక్‌నాథ్‌ పంజాబ్‌ లవ్లీ ప్రొఫెషనల్‌ వర్సిటీలో బీటెక్‌ సెకండియర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు.  పదో తరగతిలో 10కి 10 జీపీఏ, ఇంటర్‌లో 90% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.

ఆవిష్కరణలకు పేటెంట్‌ హక్కు 
తన 2 ఆవిష్కరణలకు లోక్‌నాథ్‌ పేటెంట్‌ హక్కులు సాధించాడు. సుమారు 40 పోటీల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ ఏటా నిర్వహించే స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ డేటా సిస్టం అనే కార్యక్రమంలో ఆంధ్రా నుంచి తొలిసారి ఎంపికై సర్టిఫికెట్‌ ఆఫ్‌ రికగ్నైజేషన్‌ పొందాడు. గుజరాత్‌ పారుల్‌ యూనివర్సిటీ నిర్వహించిన 48 గంటల ఆన్‌లైన్‌ కోడింగ్‌ కాంపిటీషన్‌ (హ్యాకథాన్‌)లో 3వ స్థానం, వెల్లూరు విట్‌ యూనివర్సిటీ నిర్వహించిన హ్యాకథాన్‌లో 2వ స్థానం సాధించాడు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి అభినందనలు అందుకున్నాడు.

అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధిస్తా 
దేశంలోనే పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యం. నా తల్లిదండ్రులు, అక్క ప్రోత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మహీంద్ర వంటి వివిధ మోటార్‌ వాహనాల కంపెనీల నుంచి నా ఆవిష్కరణలకు ఆహా్వనాలు అందుతున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు, వాహన ప్రమాదాల నివారణపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నాను. 
– కొత్త లోక్‌నాథ్, బీటెక్‌ విద్యార్థి, పిఠాపురం

స్మార్ట్‌ వెదర్‌ ఫోర్‌కాస్టర్‌ 
లోక్‌నాథ్‌ మరో సాంకేతిక ఆవిష్కరణ కూడా చేశాడు. ఇంటర్‌నెట్‌లేని మారుమూల ప్రాంతాల్లో వాతావరణ మార్పులను సెల్‌ఫోన్‌ ద్వారా హెచ్చరించే వ్యవస్థను రూపొందించాడు. ఫోన్‌కు టెంపరేచర్, రెయిన్‌ సెన్సార్లు అమర్చి, ఇంటర్‌నెట్‌ అవసరం లేకుండా బ్లూటూత్‌ మాడ్యూల్‌ ద్వారా వాతావరణ మార్పులను ఆ వ్యవస్థ మనకు తెలియజేస్తుంది. సెల్‌ఫోన్‌లో వాతావరణ హెచ్చరికలు సాధారణంగా వస్తుంటాయి. కానీ, లోక్‌నాథ్‌ ఆవిష్కరణలో రెయిన్‌ గేజ్‌ కూడా ఉంది. దీని ద్వారా ఎంత వర్షం, ఎంత సమయం పడింది, పడుతుంది అనే వివరాలు కూడా తెలుస్తాయి.

లోక్‌నాథ్‌ తయారు చేసిన స్మార్ట్‌ వెదర్‌ ఫోర్‌కాస్టర్‌  

మరిన్ని వార్తలు