బెజవాడ ప్లైఓవర్‌: 16న ముహూర్తం!

4 Oct, 2020 08:06 IST|Sakshi

నిర్మాణం పూర్తి చేసుకున్న దుర్గ ఫ్లై ఓవర్‌  

సాక్షి, అమరావతి :  జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. రూ.15,622 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, చేపట్టబోయే వాటికి శంకుస్థాపనలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర ఉపరితల, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీలు వర్చువల్‌ విధానంలో రూ.7,584 కోట్లతో చేపట్టే 16 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, రూ.8,038 కోట్లతో పూర్తి చేసిన 10 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.  (6న ప్రధానితో సీఎం జగన్‌ భేటీ!)

వీటిలో బెంజిసర్కిల్‌పై ఫిబ్రవరి నుంచే ఒకవైపు వాహనాలను అనుమతిస్తున్నారు. ఇప్పుడు దానిని జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే పూర్తయిన కనకదుర్గ  ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారు. తొలుత ఈ కార్యక్రమాలను సెపె్టంబర్‌ నాలుగున చేపట్టడానికి ముహూర్తం నిర్ణయించారు. కానీ అప్పట్లో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణించడంతో ఆ ముహూర్తాన్ని 8కి మార్చారు. అన్నీ సన్నద్ధమవుతున్న తరుణంలో సెప్టెంబర్‌ 18కి వాయిదా వేశారు. ఇంతలో కేంద్రమంత్రి గడ్కరీకి కరోనా సోకడంతో మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు ఈనెల 16న వీటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.   

మరిన్ని వార్తలు