వరసిద్ధుని దర్శనానికి వేళాయె

21 Aug, 2022 04:53 IST|Sakshi
విద్యుత్‌ దీప కాంతుల్లో కాణిపాకం ఆలయం

నేడు మహా కుంభాభిషేక మహోత్సవం

ఈ నెల 31 నుంచి గణనాథుని బ్రహ్మోత్సవాలు 

యాదమరి: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఐదు నెలల తర్వాత స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం ఈ నెల 21 నుంచి లభించనుంది. రూ.10 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది మార్చి 27 నుంచి గర్భాలయ మూలమూర్తి స్వయంభు దర్శనం నిలిపివేశారు. నవగ్రహ మండపం వెనుక భాగంలో బాలాలయం నిర్మించారు. అత్తికొయ్యతో వినాయక స్వామి ప్రతిమను సిద్ధం చేశారు.

ఆ రోజు నుంచి శనివారం వరకు దాదాపుగా ఐదునెలల పాటు భక్తులకు బాలాలయంలోనే స్వామి దర్శనం లభించింది. ఇక కుంభాభిషేకం క్రతువు ముగిసిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కొత్త ఆలయంలోని స్వయంభు మూలవిరాట్టు దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు తెలిపారు. ఈ నెల 31 నుంచి కాణిపాకం వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. మొత్తం 21 రోజుల పాటు వివిధ వాహన సేవల్లో స్వామివారు ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

మరిన్ని వార్తలు