'సహకార రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది'

15 Sep, 2021 14:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: సహకార రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బుధవారం డీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో చేపట్టిన సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సహకార వ్యవస్థని పూర్తిగా అవినీతిమయం చేసిందని విమర్శించారు.

ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల తప్పుడు పత్రాలతో కోట్లాది రూపాయిలు దిగమింగేశారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు చోట్లా కుంభకోణాలని వెలికి తీసామన్నారు. బ్యాంకులని నష్టపరిచే చర్యలని ఏ మాత్రం ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులని రాజకీయ పదవులగా చూడొద్దని, బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడంలో డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్ల పాత్ర కీలకమని తెలిపారు.

రైతుకి అప్పుకావాలంటే కోఆపరేటివ్ బ్యాంకులే గుర్తుకు వచ్చేలా పనితీరు ఉండాలని అధికారులకు సూచించారు. అయిదేళ్లుగా ఒకే బ్రాంచ్‌లో పనిచేస్తున్న మేనేజర్లని తప్పనిసరిగా బదిలీ చేయాలని, రుణాల మంజూరులో చేతివాటానికి పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  సొసైటీ బైఫరికేషన్ త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

చదవండి: వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు ఇప్పుడు రైతులు గుర్తుకు వచ్చారా?

మరిన్ని వార్తలు