తిరుమల : నవంబర్‌ 11నుంచి కార్తీక బ్రహ్మోత్సవాలు

8 Nov, 2020 19:16 IST|Sakshi

సాక్షి, తిరుమల : ప్ర‌పంచ‌మాన‌వాళికి ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై నిర్వ‌హిస్తున్న సుంద‌ర‌కాండ పారాయ‌ణం, విరాట‌ప‌ర్వం పారాయ‌ణం, గీతాపారాయ‌ణం కార్య‌క్ర‌మాల‌కు భ‌క్తుల ప్ర‌శంస‌లు అందుతున్నాయని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు..ఇవాళ ఉదయం‌ తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు.ఈ‌ కార్యక్రమంలో 30 మంది భక్తులకు సలహాలు,సూచనలు ఈవో తీసుకున్నారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు అక్టోబ‌రు 16 నుంచి 24వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వ‌హించామని, అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల త‌ర‌హాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో నవంబరు 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల‌ను ఏకాంతంగా నిర్వహిస్తామని చెప్పారు.

సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ నవంబరు 16 నుంచి డిసెంబరు 14వ తేదీ వరకు కార్తీకమాస రుద్రాభిషేకం,  కార్తీక పురాణ ప్రవచనం, కార్తీక మాసవ్రతం, కార్తీక వన స‌మారాధ‌న‌,కార్తీక మహాదీపోత్సవం లాంటి కార్యక్రమాలు నిర్వ‌హిస్తామని తెలిపారు.. భ‌క్తుల ర‌ద్దీని బ‌ట్టి వార‌పు రోజుల్లో 7 వేల టోకెన్లు, వారాంతంలో మ‌రిన్ని అద‌న‌పు టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

సర్వదర్శనం టైంస్లాట్‌ కౌంటర్ల వద్ద భక్తులు విధిగా మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్‌ వెంట తెచ్చుకోవడం లాంటి కోవిడ్‌-19 నిబంధనల‌ను పాటించాల‌ని ఈవో విజ్ఞప్తి చేశారు..తిరుమల‌లో నవంబరు 14న దీపావళి ఆస్థానం, నవంబరు 18న నాగుల‌ చవిత,నవంబరు 21న తిరుమల‌ శ్రీవారి పుష్పయాగ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు..

మరిన్ని వార్తలు