ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద మనసు

6 Dec, 2020 06:45 IST|Sakshi
ఉద్యోగ కల్పన ఉత్తర్వును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకుంటున్న పద్మావతి

ఎట్టకేలకు దళిత మహిళకు న్యాయం

సాక్షి, తాడిపత్రి రూరల్‌: రాజకీయ నేపథ్యం లేదు. గ్రామంలో ఇతరులతో ఎలాంటి కక్షలూ లేవు. అయినా కుల పిచ్చి నెత్తికెక్కిన ఉన్మాదులు సాగించిన దాడిలో ఓ దళిత చిరుద్యోగి హతమయ్యాడు. అడ్డుకోబోయిన మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దురాగతంపై అప్పటి టీడీపీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. బాధిత కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ఆమె కష్టాన్ని తెలుసుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చలించిపోయారు. ఆమెకు అండగా నిలిచారు. ప్రభుత్వ ఉద్యోగ కల్పనతో పాటు ఇతర పరిహారాలు అందేలా చేశారు. ఎమ్మెల్యే చొరవపై హర్షం వ్యక్తం చేస్తూ బాధిత మహిళ కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే...

దళితుడి కింద పనిచేయడం ఇష్టం లేక.. 
తాడిపత్రి మండలం ఊరుచింతల గ్రామంలోని దళిత వెంకటరమణ, పద్మావతి దంపతులు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్‌ అసిస్టెంట్‌గా వెంకటరమణ పనిచేసేవారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ రావడం.. కొందరికి ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ఓ దళితుడు చెప్పినట్లుగా తాము నడుచుకోవడమేమిటనే దురహంకారం వారిలో ప్రబలింది. ఫలితంగా 2018, సెప్టెంబర్‌ 21న పథకం ప్రకారం వెంకటరమణపై దాడి చేసి హతమార్చారు. అదే సమయంలో ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన నాగరంగయ్య సైతం దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు.  

ఆదుకోని గత టీడీపీ ప్రభుత్వం 
వెంకటరమణ హత్యకు గురి కావడంతో పద్మావతి దిక్కులేనిదైంది. ఘటనలో నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. నామమాత్రపు ఆర్థికసాయం అందించి చంద్రబాబు ప్రభుత్వం చేతులేత్తిసింది. బాధిత కుటుంబానికి ఊరట కలిగించేలా పొలం కూడా ఇవ్వలేకపోయింది. ఉద్యోగ కల్పన ఊసే లేకుండాపోయింది.  చదవండి: (ప్రసాద్‌ కుటుంబానికి 5 లక్షల సాయం)

అండగా నిలిచిన పెద్దారెడ్డి 
పద్మావతి పరిస్థితి ఇటీవల తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దృష్టికి వచ్చింది. నేరుగా ఎమ్మెల్యేని కలిసిన ఆమె తన దుర్భర స్థితిని ఏకరవు పెట్టింది. స్పందించిన ఎమ్మెల్యే ఆమెకు అండగా నిలిచారు. తాను ఇచ్చిన మాట మేరకు పెద్దవడుగూరు మండల ఎస్సీ బాలుర వసతి గృహంలో వంట మనిషి ఉద్యోగం దక్కేలా చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం అనంతపురానికి బయలుదేరిన ఎమ్మెల్యేను పుట్లూరు మండలం ఎ.కొండాపురం వద్ద పద్మావతి, మరికొందరు దళిత నాయకులు కలిసి మాట్లాడారు. ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం అందజేసిన ఉత్తర్వులను ఎమ్మెల్యేకు చూపి కృతజ్ఞతలు తెలిపారు.  

మరిన్ని వార్తలు