‘ఏబీఎన్‌’పై వెంటనే చర్యలు తీసుకోండి: పెద్దారెడ్డి

1 Aug, 2020 07:48 IST|Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి

సాక్షి, తాడిపత్రి: ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా పార్టీ పటిష్టతను దెబ్బతీసి తద్వారా తన పరువుకు భంగం వాటిళ్లే విధంగా తప్పుడు కథనాలు ప్రచారం చేసిన ఏబీఎన్‌ ఛానల్, యాజమాన్యంపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. ఈమేరకు తన అనుచరుల ద్వారా శుక్రవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరుకోవడంతో శాసన సభ్యుని హోదాలో జూలై 27న జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. అయితే కార్యక్రమం పూర్తయిన తర్వాత తన స్వగ్రామమైన యల్లనూరు మండలం తిమ్మంపల్లికి బయలుదేరి వెళ్లినట్లు పేర్కొన్నారు.


ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు

అయితే జూలై 28 తేదీన  జలహారతి కార్యక్రమానికి సంబంధించి ఫొటోలను మార్ఫింగ్‌ చేయడమే కాకుండా తన వాహనంపై దాడి చేశారంటూ పదే పదే వీడియోలను ప్రసారం చేసి తన గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేశారన్నారు.  అలాగే వైఎస్సార్‌సీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నించారన్నారు. పార్టీలో వర్గవిభేదాలున్నాయని, ఘర్షణలు జరిగాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. తప్పుడు కథనాలను ప్రసారం చేసిన ఏబీఎన్‌ ఛానల్, ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాక్రిష్ణ, జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ బి.సురేష్‌, స్థానిక ఛానల్‌ రిపోర్టర్‌ ఎ.వెంకటరమణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.   (పరిటాల శ్రీరామ్‌కు కండీషనల్‌ బెయిల్‌)

>
మరిన్ని వార్తలు