ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

3 Sep, 2020 16:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమాజంలో చెడు ధోరణిలకు కారణమవుతున్న ఆన్‌లైన్‌ గేమ్స్, (రమ్మీ, పోకర్‌ ఆన్‌లైన్‌ జూద క్రీడలు) బెట్టింగులపై నిషేధం విధిస్తూ ఏపీ గేమింగ్‌ యాక్ట్‌–1974 సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవాళ్లకు 6 నెలలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, రెండోసారి తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష విధించే విధంగా ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది.

ఉచిత విద్యుత్‌ పథకం నగదు బదిలీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పంచాయతీ రాజ్‌ శాఖలో  మెరుగైన పాలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్స్‌ పోస్టులు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. డిప్యూటీ డైరెక్టర్‌ కేడర్‌లో డెవలప్‌మెంట్‌ ఆఫీసర్స్‌ పోస్టులు ఏర్పాటు కానున్నాయి. మండల పరిషత్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్స్‌కు పదోన్నతులు కల్పించడం ద్వారా డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్స్‌ పోస్టులు భర్తీ చేస్తారు. (రైతులపై ఒక్క పైసా భారం పడదు: సీఎం జగన్‌)

ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌డీసీ) ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్‌ నెంబర్‌ 80కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీఎస్‌డీసీ నూరు శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ కాగా.. ప్లానింగ్, ఫండింగ్‌తో పాటు సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులకు ప్రణాళిక, ఫండింగ్‌ కార్పొరేషన్‌ చేయనుంది. (చదవండి: రైతులు పైసా కట్టక్కర్లేదు)

కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్‌కు దిగువన మరో రెండు కొత్త బ్యారేజీలు నిర్మాణ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి రూ.2565 కోట్లతో ప్రతిపాదన.

ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.1215 కోట్లతో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదన.

ప్రకాశం బ్యారేజీకి 62 కిలోమీటర్ల దిగువన హంసలదీవికి పైన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికోళ్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూరుపుపాలెం నడుమ మరో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.1350 కోట్లతో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదన.

వరికపూడిశెల ఎత్తిపోతల పథకం సమగ్ర సర్వే, డీటైల్డ్‌ ప్రొజెక్ట్‌ రిపోర్ట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిసింది. ఈ ప్రాజెక్టు ద్వారా గుంటూరు జిల్లా వెల్ధుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాలకు సాగునీరు అందనుంది. రూ.1273 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన.

బాబు జగజ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ ఫేజ్‌–2 నిర్మాణ ప్రతిపాదలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ సాగు అవసరాల కోసం ఎత్తిపోతల ద్వారా 63.2 టీఎంసీల నీరు అందుబాటులోకి రానుంది. రూ.15389.80 కోట్ల అంచనాలతో  నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

రాయలసీమ ప్రాంతంలో 14 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

గుంటూరు జిల్లా బాపట్ల మండలం మూలపాలెం, జమ్ములపాలెం గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 51.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదించింది.

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
 
మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాలపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

  • రాడికల్‌ యూత్‌ లీగ్‌ ( ఆర్‌వైఎల్‌)
  • రైతు కూలీ సంఘం(ఆర్‌సీఎస్‌) లేదా గ్రామీణ పేదల సంఘం(జీపీఎస్‌)
  • రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌(ఆర్‌ఎస్‌యూ)
  • సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస)
  • విప్లవ కార్మిక సమాఖ్య(వికాస)
  • ఆల్‌ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌(ఏఐఆర్‌ఎస్‌ఎఫ్‌)

పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ ఆర్డినెన్స్‌–2020ను  కేబినెట్‌ ఆమోదించింది. మత్స్యరంగంలో  సమగ్ర అభివృద్ధి కోసం ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఈ యూనివర్సిటీ కోసం రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్లు పెట్టుబడి లక్ష్యం. ఆక్వా రంగంలో నిపుణుల కొరత కారణంగా ఏడాదికి సుమారు రూ.2500 కోట్లు నష్టపోతున్నామని అంచనా. ఈ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా రూ.2500 కోట్ల ఆక్వా నష్టాన్ని నివారించవచ్చని అంచనా. దీని వల్ల సుమారు 90 వేల మంది ఆక్వా రైతులు, దీనిపై ఆధారపడ్డ మరో ఎనిమిది లక్షల మంది జనాభా లబ్ధి పొందే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు