‘నాతో పాటు పార్టీ మారవా?..’ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్‌ యత్నం కేసు

4 Feb, 2023 08:39 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

నెల్లూరు (క్రైమ్‌): తనతో పాటు పార్టీ మారలేదన్న అక్కసుతో ఓ కార్పొరేటర్‌ను నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కిడ్నాప్‌నకు యత్నించిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. శ్రీధర్‌రెడ్డి పడారుపల్లికి చెందిన నెల్లూరు నగరం 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మూలే విజయభాస్కర్‌ రెడ్డికి శుక్రవారం ఫోన్‌ చేసి వైఎస్సార్‌సీపీని వీడి తనతో రావాలని కోరారు. అందుకు విజయభాస్కర్‌ రెడ్డి నిరాకరించడంతో.. 

ఎమ్మెల్యే కోటంరెడ్డి తన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్, కారు డ్రైవర్‌ అంకయ్యతో కలిసి కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి అంతు చూస్తానంటూ బెదిరించారు. కార్పొరేటర్‌ను బలవంతంగా కారులో ఎక్కించేందుకు యత్నించగా ఆయన ప్రతిఘటించారు. వారినుంచి తప్పించుకుని వేదాయపాలెం పోలీసుస్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు, కారు డ్రైవర్‌పై కిడ్నాప్‌యత్నం కేసు నమోదు చేసినట్లు వేదాయ­పాలెం ఇన్‌స్పెక్టర్‌ కె.నరసింహారావు తెలిపారు.

మరిన్ని వార్తలు