నెల‌లు నిండ‌ని శిశువును కాపాడిన కిమ్స్ వైద్యులు

23 Oct, 2020 19:07 IST|Sakshi

ర‌క్తంలో ఇన్‌ఫెక్ష‌న్..అతిక‌ష్టం మీద శిశువును కాపాడిన వైనం 

సాక్షి, క‌ర్నూలు : నెల‌లు నిండకుండానే పుట్టిన శిశువును అతిక‌ష్టం మీద శ‌స్ర్త‌చికిత్స చేసి కాపాడారు కిమ్స్ వైద్యులు. కేవ‌లం 950 గ్రాముల అతి త‌క్కువ‌ బ‌రువు ఉండ‌టంతో పాటు పేగుల్లో ఇన్‌ఫెక్ష‌న్ కూడా ఉండ‌టంతో శిశువును కాపాడ‌టం వైద్యుల‌కు క‌త్తిమీద సాములా మారింది. అయినప్ప‌టికీ శిశువు ప్రాణాలు కాపాడి సుర‌క్షితంగా త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించిన అరుదైన ఘ‌ట‌న కిమ్స్  ఆసుప‌త్రి వైద్యుల‌కే ద‌క్కింది.  క‌డ‌ప జిల్లాకు చెందిన గీత అనే మ‌హిళ 15 ఏళ్ల వైవాహిక జీవితంలో రెండోసారి గ‌ర్భం దాల్చారు. అయితే ఆరున్న‌ర నెల‌ల‌కే ఉమ్మ‌నీరు మొత్తం పోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో సిజేరియ‌న్ చేసి బిడ్డ‌ను బ‌య‌ట‌కు తీయాల్సి వ‌చ్చింది. అయితే శిశువు  రక్తంలో ఇన్‌ఫెక్ష‌న్ ఉండ‌టంతో పాటు ప్తేగుల్లో తీవ్ర‌మైన ఇన్‌ఫెక్ష‌న్ ( నెక్రోటైజింగ్ ఎంటెరోకొలైటిస్ ) ఉన్న‌ట్లు తేలింది.

వీటితో పాటు ప్లేగుల‌కు రంధ్రం కూడా ఉన్న‌ట్లు ప‌రీక్ష‌లో వెల్ల‌డైంది. దీంతో పీడియాట్రిక్ నిపుణులైన డా. శ్రీకాంత్ బాబు సంర‌క్ష‌ణ‌లో శిశువును ఐసీయూలో పెట్టి అత్యాధునిక లైఫ్ సపోర్ట్ వ్య‌వ‌స్థ‌ల‌పై ఉంచారు. ఇలియోస్ట‌మీ (మ‌ల‌విస‌ర్జ‌న‌కు ప్ర‌త్యేక మార్గం ) ఏర్పాటు చేసి శిశువును కొన్ని రోజుల‌పాటు వెంటిలేట‌ర్‌పై ఉంచి క్ర‌మంగా తీసేశారు. అతి చిన్న వ‌య‌సులోనే శిశువుకు ఇన్‌ఫెక్ష‌న్ రావ‌డంతో 3 వారాల‌పాటు యాంటీ బ‌యాటిక్స్ ఇచ్చారు. దాంతో పాటు రెండుసార్లు ర‌క్తం  ఎక్కించి 5సార్లు ప్లేట్‌లెట్లు ఎక్కించారు. త‌ర్వాత కొద్దికొద్దిగా త‌ల్లిపాలు అల‌వాటు చేసి కంగారూ మ‌ద‌ర్ కేర్ అందించారు. దాదాపు నెల రోజుల అనంత‌రం వైద్యుల సంర‌క్ష‌ణ అనంత‌రం ప్ర‌స్తుతం పాప పూర్తిగా కోలుకుంది. ('అక్కడ ఎనిమిదో వింత ఉన్నట్లుగా ఫీలవుతున్నారు' )

మరిన్ని వార్తలు