ఏపీలో రూ.1,750 కోట్లతో..  ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ యూనిట్‌

2 Oct, 2021 07:43 IST|Sakshi
కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ సీఈవో సులజ్జ, సహ వ్యవస్థాపకుడు రితేష్‌తో మాట్లాడుతున్న సీఎం జగన్‌ 

ఏపీలో రూ.1,750 కోట్లతో..  ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ యూనిట్‌

బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్స్‌ సైతం ఏర్పాటు

స్కిల్‌ డెవలప్‌మెంట్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కూడా..

ముందుకొచ్చిన కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ.. సీఎం జగన్‌ను కలిసిన సంస్థ ప్రతినిధులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకానుంది. రూ.1,750 కోట్లతో ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌తోపాటు బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్స్‌ ఏర్పాటుచేసేందుకు కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ అయిన సులజ్జ ఫిరోదియా మొత్వాని, సహ వ్యవస్థాపకులు రితేష్‌ మంత్రి శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు.

ఈ సందర్భంగా విశాఖలో బ్రాండెడ్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ నెలకొల్పేందుకు తమ సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు వారు సీఎంకు తెలిపారు. అలాగే, స్కిల్‌ డెవలప్‌మెంట్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేయనున్నట్లు కైనెటిక్‌ గ్రీన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికే పుణె సమీపంలోని అహ్మద్‌నగర్‌లో నెలకు 6,000 ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి సామర్ధ్యంగల ప్లాంట్‌ని ఈ సంస్థ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రణాళికలను సీఎం జగన్‌కు వారు వివరించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై. శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జవ్వాది సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

చదవండి: ఏపీ పథకాలు దేశంలోనే ఆదర్శం

మరిన్ని వార్తలు