‘ఆ రాష్ట్రాలతో అతి కొద్ది సమయంలోనే పోటీ పడవచ్చు’

3 Aug, 2020 13:59 IST|Sakshi

సాక్షి, కృష్ణా : రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే రాష్ట్రంలో రోడ్లు వేయడం, డ్రెయిన్‌లు కట్టడం, శిలాఫలకాలు వేయడం అని చంద్రబాబు అనుకుంటున్నారని మంత్రి విమర్శించారు. సోమవారం జిల్లాలో కొడాలి నాని మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల్లోని ప్రజల ఆత్మ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు నడవాలని తెలిపారు. రాయలసీమ ప్రజల అభీష్టాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబు నాయుడు హైకోర్టును అమరావతిలో పెట్టారని, రాయలసీమ ప్రజల ఆత్మ గౌరవం నిలబడే విధంగా సీఎం జగన్ హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దానిని కూడా రాజకీయం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు. (చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాల్‌..)

ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలన రాజధానిని అన్ని వసతులు ఉన్న విశాఖపట్నానికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారని కొడాలి నాని పేర్కొన్నారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఉంటే దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో అతి కొద్ది సమయంలోనే పోటీ పడవచ్చని అన్నారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అన్ని  ప్రాంతాల్లో అభివృద్ధిని టీడీపీ , జనసేన అడ్డుకోవాలని చూస్తున్నాయని, కృష్ణా, గుంటూరు జిల్లా శాసన‌ సభ్యులు రాజీనామా చెయ్యాలని అంటున్నారని ఆరోపించారు. ప్రజలు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని, చంద్రబాబు నాయుడు గత అయిదు సంవత్సరాలో  గ్రాఫిక్స్‌ను చూపించారని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు