రాములోరి పెళ్లికి కోటి తలంబ్రాలు

4 Dec, 2021 09:12 IST|Sakshi
కోటితలంబ్రాల పంట కోతలో వానర వేషధారణలో భక్తులు

గోకవరం: భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి ఏటామాదిరిగా కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో కోరుకొండ శ్రీకృష్ణచైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు తన ఎకరం పొలంలో కోటి తలంబ్రాల కోసం ధాన్యం పండించారు. శుక్రవారం ఈ పంట కోతలు కోయించారు.

శ్రీరాముని వేషధారణతో పాటు జాంబవంతుడు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, అంగదుడు వేషధారణలో భక్తులు రామనామం జపిస్తూ కోతల్లో పాల్గొన్నారు. కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది భద్రాచలం, ఒంటిమిట్టల్లో నిర్వహించే సీతారాముల కళ్యాణానికి తలంబ్రాల కోసం సుమారు 800 కేజీల ధాన్యం అవసరం అవుతుందన్నారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లోని సుమారు 3 వేల మంది భక్తులకు పంపించి గోటితో ఒడ్లు ఒలిపించి తలంబ్రాలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. కొన్నేళ్లుగా ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు