జనసేన జోకర్‌ పార్టీలా మారింది.. పవన్‌ పిచ్చి స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు..

17 Jul, 2022 18:32 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుపై డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టు సత్యనారాయణ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న(శనివారం) సోము వీర్రాజు దేవాదాయ, ధర్మాదాయ శాఖా గురించి, హిందూ దేవాలయాల గురించి మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయనే అన్నింటికీ అధిపతి అని ఫీల్ అవుతున్నట్లు అనుకుంటున్నారా?. 

హిందూ దేవాలయాల జోలికి వస్తే కబడ్ధార్ అంటూ వ్యాఖ్యానించడం దేనికి సంకేతం?. టీడీపీ హయాంలో నిర్దాక్షిణ్యంగా దేవాలయాలను కూలగొడితే అప్పుడు ఏం చేశారు?. చట్టం, విధి విధానాలు గురించి తెలియకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. దిగజారిపోయి.. ఏ మాత్రం దేవాదాయ శాఖ గురించి అవగాహన లేకుండా సోము వీర్రాజు మాట్లాడుతున్నారు. మీ బీజేపీ మంత్రి హయాంలో 44 దేవాలయాలు కూలదోస్తే ఏమైనా మాట్లాడరా?. దేవాదాయ శాఖలో ఒక్క రూపాయి అవినీతి జరగ​కుండా కాపలా కాసున్నాము. దీనిపై సవాల్ చేస్తున్నాం కావాలంటే చూసుకోండి. దేవాలయాల ఆదాయం దేవాలయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని చట్టంలో ఉంది. ప్రభుత్వం ఖజానా నుండి ప్రత్యేకంగా ఖర్చు చేయదని కూడా మీకు తెలియదా?. మీరు దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. నిబంధనలకు లోబడి మా ప్రభుత్వం పనిచేస్తుంది. నిబంధనలు అతిక్రమించి పనిచేస్తే చెప్పండి. సెక్షన్ 65/1,2,3, సెక్షన్ 70లను పరిశీలించండి. 

రాష్ట్రానికి ఒక  పార్టీ అధ్యక్షుడిగా మీరు ఉన్నప్పుడు అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారు. బీజేపీకి దేశవ్యాప్తంగా దేవుడిని అడ్డపెట్టుకుని రాజకీయం చేయడం అలవాటైపోయింది.పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటో, ఆయన గమ్యం ఏంటో.. ఆయనకి కూడా తెలియదు. పవన్‌కు తెలిసింది ఒక్కటే.. పై నుండి వచ్చిన సూచనలు పాటించడమే. ఒక్క వైఎస్సార్‌సీపీతో తప్ప అన్ని పార్టీలతో సావాసం చేసిన ఘనత పవన్ కళ్యాణ్‌కే దక్కింది. పవన్ కళ్యాణ్ చేసేది పార్ట్ టైం పాలిటిక్స్. ఖాళీ ఉన్నప్పుడు వచ్చి షూటింగ్ ఉంటే వెళ్ళిపోతారు.

ఇక, రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. వరదలను కూడా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయం చేస్తున్నారు. పవన్‌ వ్యాఖ్యలు అర్ధరహితం. మొదటి దశలోనే రోడ్లపై రూ. 2205 కోట్లు కేటాయించాము. 60 శాతం పనులు పూర్తి చేశాము. వర్షాల కారణంగా ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. 95 శాతం హామీలను అమలు చేశాము. జనసేన జోకర్‌ పార్టీలా ఉంది. మేనిఫెస్టోను దాచేసి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు.  పేదల సంక్షేమాన్ని చూసి చంద్రబాబు, పవన్‌ తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబును సీఎం చేయాలన్నదే పవన్‌ తాపత్రయం. సోమవారం నుంచి శుక్రవారం వరకు తండ్రీకొడుకులు రాజకీయం చేస్తారు. శని, ఆదివారాల్లో పవన్‌కు కాల్‌షీట్లు ఇచ్చారు. పనిలేని పవన్‌.. పిచ్చి స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు. కులాలు, మతాల గురించి పవన్‌ రాజకీయం చేస్తున్నారు అని విమర్శించారు. 

మరిన్ని వార్తలు