యాంటి బయోటిక్స్‌ అనధికార విక్రయాలకు కళ్లెం

27 Nov, 2022 05:00 IST|Sakshi
విజయవాడ డిక్లరేషన్‌ను విడుదల చేస్తున్న కృష్ణబాబు, ఇతర అధికారులు

ఏఎంఆర్‌ కట్టడికి గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం 

వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు  

సాక్షి, అమరావతి: యాంటి బయోటిక్స్‌ విచ్చలవిడిగా వినియోగించడం ప్రాణాంతకంగా మారుతోందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు అన్నారు. ప్రపంచ దేశాలకు పెనుముప్పుగా మారుతున్న యాంటీ మైక్రోబియాల్‌ రెసిస్టెన్స్‌(ఏఎంఆర్‌)ను నియంత్రించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విజయవాడలో రెండు రోజులుగా జరుగుతున్న వర్క్‌షాప్‌ శనివారం ముగిసింది.

‘యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ కాల్‌ ఫర్‌ యాక్షన్‌’ను ఆవిష్కరించిన కృష్ణబాబు ఏఎంఆర్‌ యాక్షన్‌ ప్లాన్‌ల బలోపేతానికి ‘విజయవాడ డిక్లరేషన్‌’ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలను రక్షించుకునేందుకు యాంటీ బయోటిక్స్‌ వినియోగం వల్ల పెరుగుతున్న ఏఎంఆర్‌ను కట్టడి చేయాలన్నారు. ఇందుకోసం యాంటి బయోటిక్స్‌ వినియోగాన్ని తగ్గించడంతోపాటు అనధికారిక విక్రయాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఏఎంఆర్‌ కట్టడి కోసం గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఏఎంఆర్‌ కట్టడి కార్యాచరణ ప్రణాళికను ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు రాష్ట్రంలోని కృష్ణా జిల్లాను కేంద్రం ఎంపిక చేసిందని తెలిపారు. గత నాలుగేళ్లుగా అమలవుతున్న ఈ ప్రణాళిక ఫలితాలను సమీక్షించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆసియన్‌ బయోటెక్‌ అసోసియేషన్స్‌ (ఫాబా), ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫ్కాయ్‌), వరల్డ్‌ యానిమల్‌ ప్రొటెక్షన్‌ (డబ్ల్యూఏపీ) వంటి అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నాయని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్, ఏఎంఆర్‌ నోడల్‌ అధికారి జె.నివాస్, వైద్య విద్యా శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్, డ్రగ్‌ కంట్రోల్‌ డీజీ రవిశంకర్‌ నారా>యణ్, ఫాబా ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ పి.రెడ్డన్న, సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ రత్నాకర్, ఇఫ్కాయ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రంగారెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు