శాంతించిన కృష్ణమ్మ

26 Sep, 2020 05:32 IST|Sakshi

గోదావరిలో కొనసాగుతున్న ప్రవాహ ఉధృతి

పెన్నా నుంచి సోమశిలకు 16,455 క్యూసెక్కులు రాక

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురి సౌత్‌ (మాచర్ల): కృష్ణా, పెన్నా నదుల్లో వరద ప్రవాహం తగ్గగా.. గోదావరిలో ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణా నది నుంచి 1,18,326 క్యూసెక్కులు చేరుతోంది. ప్రాజెక్టులో 884.7 అడుగుల్లో 213.88 టీఎంసీలను నిల్వ చేస్తూ కుడి కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ.. 2 గేట్ల ద్వారా 1,33,900 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 

► నాగార్జున సాగర్‌లోకి 91,001 క్యూసెక్కులు చేరుతోంది. సాగర్‌లో 589.9 అడుగుల్లో 311.75 టీఎంసీలను నిల్వ చేస్తూ 4 గేట్లు, విద్యుత్‌ కేంద్రం ద్వారా 90 వేల క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు.
► పులిచింతల ప్రాజెక్టులోకి 96,718 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో 45.36 టీఎంసీలను నిల్వ చేస్తూ.. స్పిల్‌ వే గేట్ల ద్వారా 78,219 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
► ప్రకాశం బ్యారేజీలోకి వరద ప్రవాహం 29,172 క్యూసెక్కులకు తగ్గింది. కృష్ణా డెల్టాకు 10,990 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 94 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.
► సోమశిలలోకి పెన్నా నది నుంచి 16,455 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో 74.02 టీఎంసీలను నిల్వ చేస్తూ కండలేరుకు 10,238 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 
► ధవళేశ్వరంలోకి 4,21,444 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,12,876 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. గొట్టా బ్యారేజీలోకి 5,849 క్యూసెక్కులు చేరుతుండగా.. 3,489 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు. 

>
మరిన్ని వార్తలు