కాకినాడలో పర్యటించిన మంత్రి కురసాల

14 Oct, 2020 18:06 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: గత రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాకినాడలోని చీడిగ వద్ద బిక్కవోలు డ్రైయినేజ్‌కు ఎనిమిది గండ్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం కాకినాడలో పర్యటించిన మంత్రి కురసాల కన్నబాబు డ్రైయినేజ్‌ గండ్లను పుడ్చాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశం మేరకు అధికారులు జేసీబీతో గండ్లను పూడుస్తున్నారు. చీడిగా.. ఇంద్రపాలెంలోని కాలనీలలోని ముంపు ప్రాంతాలను ట్రాక్టర్‌, పడవపై తిరుగుతూ పరిశీలించారు. ఈ సంద‍ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో సహాక చర్యలు అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని 16 వేల హెక్టార్లలో వరి పంట ముంపుకు గురైందని, పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అయితే కరప మండలంలో తల్యభాగ డ్రైయిన్‌కు కూడా గండిపడే అవకాశం ఉందని,  గండిపడితే మూడు గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని మంత్రికి అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు