సాక్షి, తిరుపతి: టీడీపీ నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. కాగా, తారకరత్న మృతిపై తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు.
కాగా, లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు మా కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించాడు. నారా లోకేష్ పాదయాత్రకు, లోకేష్కు చెడ్డ పేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు దాచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారు.
రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పడే మరణ వార్త ప్రకటించి ఉండాలి. ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారు. తండ్రీకొడుకులు రాష్ట్రానికే అపశకునం అని ప్రజలకు తెలుసు. తారకరత్న భార్యాబిడ్డలను, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు. నీచమైన రాజకీయాలు చేయడం మానేస్తేనే నందమూరి కుటుంబం బాగుపడుతుందని వ్యాఖ్యలు చేశారు.