జూన్‌ నాటికి రూ.109 కోట్లతో రిజిస్ట్రేషన్స్‌ 

8 Jul, 2022 18:52 IST|Sakshi

పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో భూ రిజిస్ట్రేషన్లు జోరు

మొదటి మూడు నెలల్లోనే టార్గెట్‌కి మించి రూ.2 కోట్ల ఆదాయం

రికార్డు స్థాయిలో 37 వేల డాక్యుమెంట్లు

పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో భూ రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయి. గతంలో కరోనా వల్ల కొంత వెనుకబడినా ఈ ఏడాది మాత్రం రిజిస్ట్రేషన్స్‌ దూకుడు కొనసాగుతోంది. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకువస్తుండడంతో మొదటి మూడు నెలల త్రైమాసికంలో రూ.2 కోట్ల రాబడిని రిజిస్ట్రేషన్‌ శాఖ  రాబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాలకు చేయూతనిస్తుండడంతో రిజిస్ట్రేషన్స్‌కు సంబంధించి క్రయవిక్రయాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగంగా రిజిస్ట్రేషన్స్‌ జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 

నెల్లూరు(సెంట్రల్‌): జిల్లాలో రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా రాబడి పెరుగుతోంది. జిల్లాలోని కందుకూరు, అల్లూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, కావలి, కోవూరు, ముత్తుకూరు, పొదలకూరు, రాపూరు, ఉదయగిరి, వింజమూరు, నెల్లూరు, నెల్లూరులోని స్టౌన్‌హౌస్‌పేట, బుజబుజనెల్లూరులలో మొత్తం 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. కాగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెల మొదటి త్రైమాసికంలో టార్గెట్‌ను ఆ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ మూడు నెలలకు గాను 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో రూ.107 కోట్లు టార్గెట్‌ రావాల్సి ఉంది. కాగా రూ.109 కోట్ల టార్గెట్‌ను పూర్తి చేయడం గమనార్హం. 

37 వేల రిజిస్ట్రేషన్స్‌   
జిల్లాలోని 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సంబంధిచి గతేడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు పరిశీలిస్తే 16 వేల డాక్యుమెంట్స్‌ రిజిస్ట్రేషన్స్‌ కాగా, కేవలం రూ.60 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. గతేడాది కరోనా ప్రభావంతో రాబడి తగ్గిందని తెలుస్తోంది. కానీ ఈ ఏడాది 37,700 డాక్యుమెంట్స్‌ రిజి స్ట్రేషన్స్‌ కాగా, రూ.109 కోట్ల రాబడిని రిజి స్ట్రేషన్స్‌ శాఖ రాబట్టడం గమనార్హం. 

నెల్లూరు ముందజ.. రాపూరు వెనుకంజ 
రిజిస్ట్రేషన్స్‌ పరంగా జూన్‌ వరకు పరిశీలిస్తే 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో నెల్లూరు ప్రధాన రిజిస్ట్రేషన్‌ కార్యాలయం రూ.40.79 కోట్లతో ముందంజలో ఉండగా రాపూరు కార్యాలయం రూ.53.58 లక్షలతో వెనుకంజలో ఉంది. మిగిలిన కార్యాలయాలు కూడా అన్నింటిలో రాబడిలో దూకుడుగా ఉన్నాయని తెలుస్తోంది. 

ప్రభుత్వ ప్రోత్సాహం 
రాష్ట్ర ప్రభుత్వం చిన్నా, పెద్ద పరిశ్రమలతోపాటు ఇతర నిర్మాణ రంగానికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తుండడంతో క్రయవిక్రయదారులు ముందుకువస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు క్రయవిక్రయాలు చేస్తుండడంతో రిజిస్ట్రేషన్స్‌ ద్వారా రాబడి పెరుగుతోంది. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న నాన్‌ టీడీసీపీ లేఅవుట్‌లకు కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో కొనుగోలుదారులకు ఇబ్బందులు లేకుండాపోయాయి. రానున్న రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్స్‌ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు      –  15 
మొదటి త్రైమాసికంలో రాబడి               – రూ.109 కోట్లు 

అన్నివిధాలుగా సేవలు అందిస్తున్నాం 
జిల్లాలోని 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో వినియోగదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నాం. అన్నివర్గాల ప్రజలకు సంబంధించి, ఎలాంటి రిజిస్ట్రేషన్స్‌ చేసుకోవాలన్నా, చిన్నచిన్న సాంకేతి సమస్యలు వస్తే తప్ప, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం.
– కిరణ్‌కుమార్, డీఐజీ, రిజిస్ట్రేషన్స్‌  

మరిన్ని వార్తలు