అశక్తులకు ‘వైఎస్సార్‌ పెన్షన్‌’ శక్తి 

14 Mar, 2023 03:42 IST|Sakshi

దీర్ఘకాలిక రోగగ్రస్తులకు పెద్ద మొత్తంలో పెన్షన్‌ సాయం 

దేశంలోనే అత్యధిక పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు  

తలసేమియా, హీమోఫిలియా, సికిల్‌సెల్‌ బాధితులకు నెలకు రూ.10వేలు..  

పక్షవాతం, కండరాల క్షీణత, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు రూ.5వేలు 

ఉచిత వైద్యంతోపాటు పెన్షన్‌ అందజేతతో జాతీయ స్థాయిలో ప్రశంసలు

సాక్షి, అమరావతి: .. ఇలా ఈ ఇద్దరికే కాదు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వేల మంది అశక్తులకు సీఎం వైఎస్‌ జగన్‌ పెన్షన్‌ అందిస్తూ వారికి శక్తినిస్తోంది. ఇ­లాంటి తీవ్ర, దీర్ఘకాలిక బాధితులను ఆదుకునేందుకు వారికి ఉచిత వైద్యంతో పాటు ప్రతినెలా పెద్ద మొత్తంలో వారికి పెన్షన్‌ అందిస్తూ జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది.

తలసేమియా, సికిల్‌సెల్, హిమోఫిలియా, తీవ్రమైన మూత్రపిండాల (కిడ్నీ) రోగులు, కిడ్నీ, లివర్, గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి, ఇంకా అనేక దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారి­కి, దివ్యాంగులకు సైతం నెలవారీ పెన్షన్‌ అందిస్తూ వారికి కొండంత అండగా నిలుస్తోంది. అలాగే, దేశంలో అత్యధిక పెన్షన్‌ మొత్తాన్ని అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది.

ఇదే విషయాన్ని కేంద్ర సామాజి­క న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్రకుమార్‌ సైతం గతేడాది గుజరాత్‌లో జరిగిన జాతీయ సదస్సులో ప్రస్తావించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆభినందించారు. ఏపీని మిగిలిన రాష్ట్రాలూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూ­చించారు. మొత్తం మీద సామాజిక భద్రతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందనడానికి ఇదే గొప్ప నిదర్శనం.  

దివ్యాంగులకు బాబు మొక్కుబడిగా.. 
గత చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో దివ్యాంగులకు నామమాత్రంగా పెన్షన్‌ ఇచ్చి సరిపెట్టింది. అది కూడా వారిని రెండు కేటగిరిలుగా చూపించి రూ.వెయ్యి, రూ.1,500 చొప్పున పెన్షన్‌ ఇచ్చేది. కానీ, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక 2019 జూన్‌ నుంచి దివ్యాంగులతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాంత్వన చేకూర్చేలా పింఛన్లు మంజూరు చేసింది. దివ్యాంగులందరిని ఒకే కేటగిరిగా చేసి నెలకు రూ.3 వేలు చొప్పున పింఛను ఇస్తుండటం విశేషం.

సామాజిక భ్రద్రతలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ 
కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన ఉమాదేవి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ప్రతి 21 రోజులకు ఒకసారి రక్తమార్పిడి చేయాలి. బిడ్డను కాపాడుకోవడానికి ఆమె తల్లిదండ్రులు పడు­తున్న వేదనను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థంచేసుకుంది. ఉమాదేవికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తోంది. అంతేకాదు.. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకగా ప్రతినెలా రూ.10 వేలు పింఛను అందించి ఆ కుటుంబానికి భరోసా ఇస్తోంది.

కర్నూలు జిల్లా చానుగొండ్ల గ్రామానికి చెందిన గంగాధర్‌ హిమోఫిలియా­తో బాధపడుతున్నాడు. మోకాళ్లు, కాలిమడం, చేతులు (జాయింట్లు) వాపులు వాస్తున్నాయి. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో తలసేమియా, సికిల్‌సెల్‌ రోగుల మాదిరిగానే గంగాధర్‌కు కూడా వైద్యం అందించి ఉచితంగానే మందులు ఇస్తున్నారు. కష్టాల్లో ఉన్న అతని కుటుంబానికి భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా ప్రతినెలా రూ.10 వేలు అందిస్తోంది.

అశక్తులకు అండగా ప్రభుత్వం  
రాష్ట్రంలో అశక్తులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో 14 రకాల రోగ పీడితులు, వైకల్యాలున్న 7,98,352 మందికి నెలకు మొత్తం రూ.255కోట్లకు పైగా పింఛన్లు ఇస్తోంది. దివ్యాంగులతోపాటు తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫిలియా, బోదకాలు, కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేసుకున్న వారికి, కిడ్నీ రోగులకు, కుష్టు వ్యాధిగ్రస్తులకు, పక్షవాతం, రోడ్డు ప్రమాదాలతో కుర్చీ, మంచానికే పరిమితమైన వారికి, కండరాల క్షీణత వంటి సమస్యలున్న వారికి ప్రభుత్వం ఉచిత వైద్యంతోపాటు నెలనెలా పింఛను ఇస్తూ ఆందుకుంటోంది.  – బి. రవిప్రకాశ్‌రెడ్డి, సంచాలకుడు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ 
 

మరిన్ని వార్తలు