మిర్చి రైతులను ఆదుకోండి

31 Dec, 2021 04:36 IST|Sakshi
కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇస్తున్న ఎంపీ లావు

దెబ్బతిన్న మిర్చిని కేంద్ర ప్రభుత్వమే కొనాలి

కేంద్ర మంత్రి తోమర్‌కు ఎంపీ శ్రీకృష్ణదేవరాయల వినతి

సాక్షి, న్యూఢిల్లీ/నరసరావుపేట: ఆంధ్రప్రదేశ్‌లో నష్టపోయిన మిరప రైతుల్ని ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. గుంటూరు మిర్చి సుమారు రూ.5 వేల కోట్లకు పైగా టర్నోవర్‌తో 40కి పైగా దేశాలకు ఎగుమతి అవుతోందని తెలిపారు. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 1.4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల రెండు తుపాన్లతో విస్తృతంగా పంట నష్టం జరిగిందన్నారు.

14 వేల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలోని పంటపై నల్లతామర తెగులు ప్రభావం చూపిందని, సుమారు రూ.500 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు.  పురుగు ఎందు కు ఆశిస్తోందో అధ్యయనం చేసి నివారణ చర్యల గురించి రైతులకు మార్గనిర్దేశం చేయడానికి నిపుణుల బృం దాన్ని పంపాలని, నల్లతామర ప్రభావం తగ్గించడానికి అవసరమైన పురుగుమందులను ఏపీ ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాలో పీఎం ఫసల్‌ బీమా యోజన సార్వత్రిక కవరేజీ ముందస్తుగా నిర్ధారించాలని కోరారు. నేషనల్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా నష్టపోయిన పంటను సేకరించాలని  విజ్ఞప్తి చేశారు.

కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన అభ్యర్థనను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం గురువారం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని ఐసీఏఆర్‌–ఎన్‌సీఐపీఎం సైంటిస్టు డాక్టర్‌ కె.రాఘవేంద్ర, బెంగళూరుకు చెందిన ఎంట మాలజీ సైంటిస్టు డాక్టర్‌ రచనారుమాణీ, ఫరీదా బాద్‌కు చెందిన డాక్టర్‌ ఒ.పి.వర్మ, విజయవాడ సీఐపీఎంఈ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.పి.గోస్వామి, రాష్ట్ర ఉద్యానవనశాఖ అధికారిని నియమించింది. 

మరిన్ని వార్తలు