జూనియర్‌ న్యాయవాదులకు అండగా లా నేస్తం

22 Feb, 2023 06:05 IST|Sakshi

నేడు బటన్‌ నొక్కి నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: లా నేస్తం పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2,011 మంది జూనియర్‌ న్యాయవాదుల కోసం రూ.­1,00,55,000లను రాష్ట్ర ప్రభు­త్వం విడుదల చేయనుంది. సీఎం  వైఎస్‌ జగన్‌  బుధవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లోకి జమచేయ­నున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్‌ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయ­వాద వృత్తిలోకి వచ్చిన జూనియర్‌ న్యాయవాదులు వృత్తిలో ఎదు­రయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతీ జూనియర్‌ న్యాయవాదికి నెలకు రూ.5వేల చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బుధవారం చెల్లించ­బో­యే మొత్తంతో కలిపి ఇప్పటివరకు 4,248 మంది న్యాయ­వాదులకు మూడున్నరేళ్లలో అందించిన ఆర్థిక సాయం రూ.35.40 కోట్లు.

ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.­100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం అడ్వొకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసింది.

కోవిడ్‌ సమ­యంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్‌ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్‌ నుంచి ఆర్థిక సాయం అందచేస్తారు.  

మరిన్ని వార్తలు