Law Student: పరీక్షలో ఫెయిల్‌ చేశారని పోలీసులకు ఫిర్యాదు!

28 May, 2022 14:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎచ్చెర్ల క్యాంపస్‌(శ్రీకాకుళం): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం న్యాయ విభాగంలో దురుద్దేశంతో తనతో పాటు కొందరు విద్యార్థులను పరీక్షల్లో ఫెయిల్‌ చేశారని, ఇందుకు బాధ్యులైన ఇద్దరు కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి రంగరాజుల గోపీనాథ్‌ తెలిపారు. సిలబస్‌లో లేని ప్రశ్నలు 50 శాతం ప్రశ్నపత్రంలో రావడంతో బోధకులను నిలదీశామని, దీనిపై కక్ష పెట్టుకొని ఫెయిల్‌ చేశారని పేర్కొన్నారు.

ఉద్దేశపూర్వకంగా ఫెయిల్‌ చేయడం యూజీసీ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. పోలీసులు కేసునమోదు చేసి విచారణ నిర్వహించాలని కోరారు. విశ్వవిద్యాలయం అధికారులు స్పందించి ప్రత్యేక కమిటీ వేయాలని, జవాబు పత్రాలను ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన అర్హులైన బోధకులతో పునఃమూల్యాంకనం చేయాలని విన్నవించారు. ఈ విషయమై ఎచ్చెర్ల ఎస్సై కె.రాము వద్ద ప్రస్తావించగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

చదవండి: Kirru Cheppulu: ట్రెండ్‌ మారింది.. కిర్రు చెప్పుల ‘సోగ్గాడు’
 

మరిన్ని వార్తలు